UNION BUDGET 2020: బడ్జెట్ లో తెలంగాణాకు మొండి చెయ్యి..నిరాశాజనక బడ్జెట్: టీఆర్ఎస్
కేంద్ర బడ్జెట్లో తెలంగాణాకు మొండిచెయ్యే ఎదురైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. తెలంగాణా ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. నిరాశాజనక బడ్జెట్ అని ఆయన పెదవి విరిచారు. తెలంగాణాకు ఇచ్చిన విభజన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు .

బడ్జెట్ లో తెలంగాణా రాష్ట్రానికి మొండి చెయ్యి
తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఇస్తున్న బడ్జెట్లో తెలంగాణా రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఏమీలేవని ఎంపీ నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన బకాయిలు కూడా ఇవ్వలేదని విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సినవి ఒక్కటి కూడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ బడ్జెట్లోనైనా బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం వస్తాయని భావించామని కానీ ఆ ప్రస్తావనే లేదని అన్నారు .

ఇండస్ట్రియల్ కారిడార్ల ప్రకటన లేదని అసహనం
వరంగల్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి నాగ్పూర్కు ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్- బెంగళూరు- చెన్త్నె సౌత్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చెయ్యటానికి కేంద్రం చొరవ చూపుతుంది అని భావిస్తే అది కూడా లేదన్నారు. ఒకపక్క తెలంగాణా రాష్ట్రంలోని రైతు బంధును మెచ్చుకుంటూనే రైతులకు అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు. రైతుల ఆదాయం రానున్న నాలుగేళ్ళలో ఎలా పెంచుతారో విధానం చెప్పలేదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రస్తావనే లేదన్న ఎంపీ నామా నాగేశ్వర్ రావు
ఇక విభజన చట్టం ప్రకారం ప్రకటించిన హామీలు నెరవేరలేదు. విభజన చట్టంలో ఎయిమ్స్ ప్రకటించినా అనుమతులు, కేటాయింపులు జరగలేదు. ట్రైబల్ మ్యూజియం ప్రస్తావనే లేదు అని ఆయన తెలిపారు . అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఊసే లేదు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు సాయం చేయాలని కోరినా పట్టించుకుంది లేదని ఆయన మండిపడ్డారు . ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని కోరినా ఇచ్చింది లేదని పేర్కొన్న నామా నాగేశ్వర్ రావు ఇహి పూర్తిగా తెలంగాణాకు మొండి చెయ్యి ఇచ్చిన బడ్జెట్ అన్నారు. అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. చాలా నిరాశాజనకమైన బడ్జెట్ గా అభివర్ణించారు .












Click it and Unblock the Notifications