తిరుమల లడ్డు వ్యవహారం.. సనాతన ధర్మంపై పవన్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి మద్దతు!
తిరుమలలో శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి పై విచారణకు సిట్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం సిట్ చీఫ్ గా నియమించింది.
హిందువులకు మనోభావాలు ఉండవా?
ఇది ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంలో కొనసాగుతున్న రగడ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మానికి మద్దతుగా చేస్తున్న వ్యాఖ్యలపైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన మద్దతును ప్రకటించారు. హిందూ ధర్మం జోలికి ఎవరు రావద్దని ఆయన అన్నారు. హిందువులకు మనోభావాలు ఉండవా అంటూ ఆయన ప్రశ్నించారు.

పవన్ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటించిన బండి సంజయ్
ఆలయాలలో అపవిత్రమైన పనులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ నిలదీసిన బండి సంజయ్ సనాతన ధర్మంపై అడ్డగోలుగా ఎవరు మాట్లాడిన చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఇంద్రకీలాద్రి వేదికగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేయడంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
సనాతన ధర్మంతో పెట్టుకుంటే సహించేది లేదు
సనాతన ధర్మంతో ఎవరైనా పెట్టుకుంటే మా హిందువులమంతా గొంతు విప్పుతాం. న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం. లౌకికవాదం అనేది రెండు మార్గాలున్న వీధి లాంటిది ఇతరులు మమ్మల్ని కొడుతుంటే దెబ్బలు తింటామని భావిస్తున్నారేమో అది జరగదు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. పంచింగ్ బ్యాగ్స్ మాదిరిగా మేము మౌనంగా ఉండబోమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు .
ఎక్స్ వేదికగా బండి సంజయ్ పోస్ట్
ఎక్స్ వేదికగా బండి సంజయ్ స్పందించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవిత్రాణాయ సాధునాం వినాశాయ చతుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ ముగించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తన మద్దతును ప్రకటించి సనాతన ధర్మం పైన హిందువులంతా ఒకటిగా ఉండాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
సిట్ విచారణపైన సర్వత్రా ఆసక్తి
ఇదిలా ఉంటే ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించి నిజానిజాల నిగ్గు తేల్చాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. మరి సిట్ విచారణలో ఈ వ్యవహారంలో ఏం తేలుతుందో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications