శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలా ? కేసీఆర్ సర్కార్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష చూపుతోందని, అవసరమైన మందులు ఇంజెక్షన్లు ఇవ్వడం లేదని తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి , బీజేపీ నేత కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ వి శవరాజకీయాలని మండిపడ్డారు .
కరోనా వ్యాక్సిన్ ధరల రగడ : జిఎస్టీ విధానంతో లింక్ , కేంద్రాన్ని లాజిక్ తో కొట్టిన మంత్రి కేటీఆర్ !!
కరోనా బాధితులకు వైద్య సదుపాయాల లేమిపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన మంత్రులు
మొన్నటికి మొన్న తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత, వైద్య సదుపాయాల లేమి కి కేంద్రం బాధ్యత తీసుకోవాలని, నాలుగు లక్షల రెమిడెసివిర్ డోసులు రాష్ట్రానికి కావాలని అడిగితే కేవలం 21,550 డోసులను కేంద్రం ఇవ్వడానికి అంగీకరించిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక మరోవైపు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా కేంద్రాన్ని టార్గెట్ చేశారు .గుజరాత్ కు లక్షా అరవై మూడు వేల ఇంజక్షన్ లను సరఫరా చేసి, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం 21 వేల ఇంజక్షన్లు ఇచ్చిందని మండిపడ్డారు.
కరోనాను ఎదుర్కోలేక కేంద్రంపై ఆరోపణలా ? మండిపడిన కిషన్ రెడ్డి
ఆక్సిజన్ కొరతతో ఎవరు మరణించినా కేంద్రానిదే బాధ్యత అని ఎర్రబెల్లి దయాకర్ రావు సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని ఎదుర్కోలేక కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డ కిషన్ రెడ్డి, కెసిఆర్ కుటుంబ సభ్యులు శవాల మీద పేలాలు ఏరుకునే రాజకీయాలు చేయడం సరికాదని, కరోనాతో ప్రజలు చనిపోతుంటే రాజకీయాలు చేయడం ఏమిటని నిలదీశారు.
కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చెప్పడం దురదృష్టకరం
కేసీఆర్ కుటుంబం, అలాగే మంత్రులు అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బాధ్యతారహితమైన కామెంట్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి . ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూపించడం సరికాదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని చెప్పడం దురదృష్టకరమని మండిపడిన కిషన్ రెడ్డి కేంద్రానికి అందరి ప్రాణాలు సమానమేనని స్పష్టం చేశారు. వివక్ష చూపిస్తే కేంద్రం గాంధీ హాస్పిటల్ కి గాలి నుండి ఆక్సిజన్ తయారుచేసే యూనిట్లు ఎందుకు ఇచ్చిందనిప్రశ్నించారు.
ఆక్సిజన్ తయారీ యూనిట్లు కేంద్రం ఇచ్చిందన్న కిషన్ రెడ్డి
ఆక్సిజన్ తయారీ యూనిట్లు రెండు రోజుల్లో గాంధీ ఆస్పత్రిలోఅందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వాటి ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, వరంగల్, కరీంనగర్ లో కూడా ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్లను కేంద్రం పంపిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
టిఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా కరోనా కష్టాల్లో ప్రజలుంటే , ప్రజల సమస్యలు పరిష్కరించాలని ,రాజకీయాలు చేయడం మానుకోవాలని, వివక్ష అంటూ చేస్తున్న వ్యాఖ్యలు తప్పని కిషన్ రెడ్డి మండిపడ్డారు.