వినాశకాలే విపరీతబుద్ధి.. బండి సంజయ్, రాజాసింగ్ ల అరెస్ట్ అందుకే: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ ఎంపీలు పర్వేశ్ వర్మ, మంజీందర్ సిర్సా చేసిన ఆరోపణలతో తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవితను అతర్గేట్ చేసి ఆమె ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించటం ఆపై బిజెపి నేతల అరెస్టులు, మళ్ళీ ఆందోళనలతో తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.

బండి సంజయ్, రాజా సింగ్ ల అరెస్ట్ పై మండిపడిన కిషన్ రెడ్డి
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లను పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం ఉందని విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి పాదయాత్రను ఆపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కుటుంబం అభద్రతా భావంలో ఉంది
అధికారం కేసీఆర్ కుటుంబం నుండి చేయి జారిపోతుంది అన్న ఆందోళనలో బిజెపి నేతలను అరెస్టు చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కెసిఆర్ కుటుంబం అభద్రతాభావంతో ఉందని విమర్శించిన కిషన్ రెడ్డి, తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ఉన్న సమయంలోనే ఇటువంటి చర్యలకు పాల్పడతారు అంటూ మండిపడ్డారు. కేంద్రంపై కావాలని టిఆర్ఎస్ ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతూ విష ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
బిజెపి నేతలపై అక్రమ కేసులు బనాయించి, ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను రెచ్చగొట్టి పాదయాత్రలో అడ్డుకోవాలని పిలుపునిస్తున్నారని, ఇదంతా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్న పాదయాత్రను భగ్నం చేసి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానని పేర్కొన్న కిషన్ రెడ్డి కెసిఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ ప్రజలకు త్వరలోనే విముక్తి లభిస్తుందని వ్యాఖ్యలు చేశారు.

నిన్న జరిగింది సింబాలిక్ ప్రొటెస్ట్ మాత్రమే
ప్రజలు కూడా కెసిఆర్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఎప్పుడెప్పుడు గద్దె దించాలా అని ఎదురుచూస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న కవిత ఇంటి దగ్గర జరిగింది సింబాలిక్ ప్రొటెస్ట్ మాత్రమే అని పేర్కొన్న కేంద్రమంత్రి, భవిష్యత్తులో కేసీఆర్ ప్రభుత్వ పాలన పై, అవినీతిపై పెద్ద ఎత్తున పోరాటం జరగబోతుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications