తెలంగాణాలో ఆ కేంద్ర పథకం అమలుపై కేంద్రమంత్రి కన్నెర్ర.. వారికి డెడ్ లైన్!
కేంద్ర ప్రభుత్వం చేతి వృత్తుల వారికి అండగా నిలవటం కోసం తీసుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ పథకం విశ్వకర్మ పథకం. కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన పీఎం విశ్వకర్మ స్కీమ్ లో భాగంగా రూ. 3 లక్షల లోన్ పొందవచ్చు. సాంప్రదాయ చేతిపనులు, చేతివృత్తుల్లో నిమగ్నమైన వారికి ఆర్థిక సాయం చేసి వారి ఆర్ధిక పురోగతికి నిర్దేశించిన ఈ పథకం తెలంగాణాలో నీరుగారిపోతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వకర్మ పథకం అమలుపై కేంద్రమంత్రి సీరియస్
విశ్వకర్మ పథకం అమలుపై అధికారులు దృష్టి పెట్టాలనీ, వచ్చే 45 రోజుల్లో పథకాన్ని పూర్తి స్థాయిలో అమలుచేయాలని, లేదంటే చర్యలు తప్పవని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి G కిషన్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. విశ్వకర్మ పథకం లక్ష్యాలకు అనుగుణంగా అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బేగంపేట్ టూరిజం ప్లాజా లో నేడు దిశ కమిటీ సమావేశంలో ఆయన ఈ మేరకు ఆదేశించారు.

18 వేల దరఖాస్తులు వస్తే 600 మందికే ఇస్తారా?
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశ్వకర్మ పథకం లక్ష్యం నిరుగారిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకంకింద 18 వేల దరఖాస్తులు అందితే, కేవలం సుమారు ఆరు వందలమంది లబ్దిదారులకు మాత్రమే పథకం మంజూరయిందని పేర్కొన్నారు. వచ్చే 45 రోజుల్లో కార్యక్రమాన్ని గ్రౌండ్ చేయకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న లోన్లపై ఆరా
సాంకేతిక సమస్యల పేరుతో పథకం అమలులో జాప్యం చేయవద్దని చెప్పారు. అలాగే జిల్లాలో మహిళలకు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న లోన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళా శక్తి కింద మహిళకు అందుతున్న లోన్లలో అలసత్వం లేకుండా వెంటనే వారికి అందేలా చర్యలు తీసుకోవాలని బ్యాంక్ అధికారులకు సూచించారు. ఎడ్యుకేషన్ లోన్లు విద్యార్థులకు అందించడంలో బ్యాంకర్లు విఫలం అవుతున్నారని అట్టి సమస్యలు లేకుండా వారికి లోన్లు మంజూరు చేయాలన్నారు.
స్వచ్చ భారత్ పనుల నిర్వహణపైనా అసంతృప్తి
GHMC పరిధిలో స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్ మెయింటెనెన్సు లో కూడా కనీస సౌకర్యాలు లోపించాయని మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో కేంద్రంతో పాటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటా నిధులివ్వాలని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నగరంలో 2 వేల 2 వందల పైగా టాయిలెట్స్ ఉండగా, వాటి క్లీనింగ్, వాటి నిర్వహణ పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications