తెలంగాణా హైస్పీడ్ రైల్ కారిడార్ లపై అదిరిపోయే శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే పురోగతికి అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ ను మరింత బలోపేతం చేయడానికి భారతీయ రైల్వే కృషి చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఇతర ప్రధాన నగరాలకు హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న రైల్వే ఈ నేపథ్యంలో కీలక అడుగులు వేస్తోంది.
తెలంగాణాలో రైల్వే కీలక అడుగులు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనులను గురించి, రవాణా వ్యవస్థలో రైల్వే వేస్తున్న కీలక అడుగుల గురించి శుభవార్త చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ నుంచి దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటుచేసి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు.

రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
సికింద్రాబాద్లోని రైల్వేలో దక్షిణ మధ్య రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన అనేక కీలక విషయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్క్ ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన ఆయన, జోన్ పరిధిలో కొనసాగుతున్న పనులపైన అధికారుల ద్వారా వివరాలను తెలుసుకున్నారు.
రైల్వే ప్రాజెక్ట్ లు, సర్వేలు, సేవలపైన సమీక్షించిన కిషన్ రెడ్డి
జోన్ పరిధిలో వివిధ ప్రాజెక్టులు, సర్వేలు, రైల్వే అందిస్తున్న సేవలపైన ఆయనకు అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలను అందించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికతతో కూడిన సౌకర్యాలను రైల్వే స్టేషన్లలో కల్పించాల్సిన అవసరం ఉందని, రాబోయే 50, 60 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.
హై స్పీడ్ కారిడార్ల ప్రతిపాదనల పైన చర్చించిన కేంద్రమంత్రి
రైల్వే ఫుట్ ఓవర్, అండర్ బ్రిడ్జ్ ల నిర్మాణం, వాటి ప్రస్తుత పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. హైదరాబాదు నుండి ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానం చేసే హై స్పీడ్ కారిడార్ల ప్రతిపాదనల పైన కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ నుండి బెంగళూరుకు, హైదరాబాద్ నుండి చెన్నైకి కలిపే రెండు ప్రతిష్టాత్మక హై స్పీడ్ రైలు కారిడార్ల నిర్మాణం గురించి, వాటి అంచనా వ్యయం గురించి చర్చించారు.
అన్ని రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో కీలక ఆదేశాలు
ఈ రెండు రైల్వే కారిడార్ లకు కలిపి అంచనా వ్యయం సుమారు 3.30లక్షల కోట్ల రూపాయలు అవుతుందని హైదరాబాద్ - బెంగుళూరు కారిడార్ కు సుమారు 1.44లక్షల కోట్లు, హైదరాబాద్ - చెన్నై కారిడార్ కు 1.86లక్షల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనాగా చెప్పారు. ఇక నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులోనే పూర్తి చేయాలని సూచించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు, ఆధునీకరణ పనులకు కేంద్రం పెద్దపీట వేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications