ఏమిచ్చామా..? ‘తెలంగాణ’పై నిర్మలా సీతారామన్ హాట్ కామెంట్స్
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో గురువారం ఆమె మాట్లాడుతూ.. బడ్జెట్లో తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్న కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉందని, ఆ తర్వాతే అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అయితే, తాను ఏ పార్టీని నిందించడం లేదన్నారు.
ఆ తర్వాత తెలంగాణకు కేటాయించిన నిధులు, అందించిన ప్రత్యేక ప్రాజెక్టుల గురించి వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిజామాబాద్లో పసుపు బోర్డును ఏర్పాటు చేసిన ఘనత నరేంద్ర మోడీ సర్కారుదేనని అన్నారు. జహీరాబాద్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని నిర్మలా సీతారమన్ తెలిపారు.

బీబీనగర్లో ఎయిమ్స్ ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి తెలిపారు. తెలంగాణలో రైల్వే అభివృద్ధికి రూ. 5337 కోట్లు కేటాయించామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో 2605 కిలోమీటర్ల జాతీయ రహదారులు వేశామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వరంగల్లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. తెలంగాణకు కొత్తగా ఐదు వందేభారత్ రైళ్లను కేటాయించినట్లు చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు.
తెలంగాణలో 1.2 లక్షల జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. తెలంగాణలోని 9 వెనుకబడిన జిల్లాలకు ఒక్కొ జిల్లాకు 50 కోట్ల చొప్పున కేటాయించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేశారని.. అయితే, మెదక్కు తొలి రైల్వే స్టేషన్ ఇచ్చింది మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వమని నిర్మలా సీతారామన్ వివరించారు. అంతేగాక, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని పునర్ ప్రారంభించింది కూడా మోడీ ప్రభుత్వమేనని చెప్పారు. నిర్మలా సీతారామన్ ప్రసంగిస్తుండగా.. బీజేపీ ఎంపీలు హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications