కేసీఆర్! అప్పుడు ఒప్పందం.. ఇప్పుడు ఆందోళనలా?: ధాన్యం సేకరణపై తేల్చేసిన పీయూష్ గోయల్
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో వరుసగా ఆందోళనలు చేస్తున్న క్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం(ఎంవోయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
వానాకాలం పంట పూర్తి కొంటామని కేసీఆర్తో చెప్పాం: పీయూష్ గోయల్
బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ సభ్యుడు కే కేశవరావు(కేకే) రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. సీఎం కేసీఆర్తోనూ మాట్లాడానని, వానాకాలం పంట పూర్తిగా కొంటామని స్పష్టం చేశారు. దేశంలో ప్రతి ఏటా ధాన్యం సేకరణను పెంచుతున్నామని, తెలంగాణ నుంచి కూడా బాగా పెంచామని కేంద్రమంత్రి వివరించారు.
ఎంవోయూకు తెలంగాణ సర్కారు కట్టుబడాలి
2018-19లో తెలంగాణ నుంచి 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. 32.66 టన్నులే ఇచ్చిందని తెలిపారు. ఎంవోయూకు కట్టుబడి ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోందని పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ పెండింగ్ ధాన్యమే ఇవ్వలేదు.. భవిష్యత్తా: పీయూష్ గోయల్
ధాన్యం సేకరణ విషయంలో కర్ణాటక నమూనా చాలా బాగుందని కేంద్రమంత్రి పీయూష్ గోల్ చెప్పారు. దాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ నుంచి 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం జరిగిందని.. దాన్ని 44 లక్షల టన్నులకు పెంచామని కేంద్రమంత్రి వివరించారు. ఇప్పటి వరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నులు పెండింగ్ ఉందని చెప్పారు. పెండింగ్ ధాన్యం పంపకుండా భవిష్యత్ గురించి టీఆర్ఎస్ ప్రశ్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ కొనబోమని ముందుగానే చెప్పామని, ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయినా భవిష్యత్ గురించి ప్రశ్నిస్తూ.. టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు.
బాయిల్డ్ రైస్ పంపబోమని కేసీఆర్ సర్కారే లేఖ రాసింది: పీయూష్ గోయల్
ఇకపై బాయిల్డ్ రైస్ పంపబోమని అక్టోబర్ 4న తెలంగాణ రేఖ రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం బాయిల్డ్ రైస్ కొనాలని పదే పదే గొడవ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ధాన్యం విషయాన్ని ఎందుకు రాజకీయం చేేస్తున్నారో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భౌతిక తనిఖీల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వెళ్లారని, ఆ రాష్ట్రం లెక్కలను సరిగా నిర్వహించడం లేదన్నారు. ధాన్యం సేకరణ కేంద్రానికి కొత్త కాదని, ఏళ్ల తరబడి ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైనంతవరకూ తెలంగాణకు సహకరిస్తోందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. కాగా, ధాన్యం కొనుగోలు చేయాలసిందేనని టీఆర్ఎస్ ఎంపీలు అటు లోక్సభ, ఇటు రాజ్యసభలోనూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి నిరసనలు తెలుపుతున్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామంటున్నారు.