పీహెచ్ .డీ స్కాలర్స్ కు తీవ్ర హెచ్చరిక!
ఉన్నత విద్యా రంగంలో సొంతంగా పరిశోధనలు సాగించాల్సిన పీహెచ్డీ విద్యార్థులు సాంకేతికతను తప్పుడు మార్గాల్లో ఉపయోగిస్తున్నారు. చాట్జీపీటీ, జెమినై వంటి అధునాతన కృత్రిమ మేధ సాధనాల సాయంతో రీసెర్చ్ పేపర్లు, థీసిస్లను సులభంగా తయారు చేసి సమర్పిస్తున్న విద్యార్థుల ఆటకట్టించడానికి యూనివర్సిటీల అధికారులు నడుం బిగించారు.
పీహెచ్డీ లు చెక్ చేసేందుకు ప్రత్యేక ఏఐ చెకింగ్ సాఫ్ట్వేర్
ఇందులో భాగంగానే విద్యార్థులు సమర్పించే పరిశోధనా పత్రాలలోని నిజాయితీని, నాణ్యతను పరీక్షించడానికి విశ్వవిద్యాలయం ప్రత్యేక ఏఐ చెకింగ్ సాఫ్ట్వేర్ను రంగంలోకి దించింది.
గత ఏడాది జూలై నెల నుంచే ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 'టర్నిటిన్' అనే అత్యాధునిక సాఫ్ట్వేర్ను వినియోగిస్తోంది. విద్యార్థులు సమర్పించే భారీ థీసిస్ కాపీలను ఈ సాఫ్ట్వేర్ కేవలం పది నిమిషాల్లోనే పూర్తిగా స్క్రీన్ చేస్తుంది.

పరిశోధనల కాపీలలో భారీగా కాపీ కంటెంట్
సదరు పరిశోధనలో ఎంత శాతం సొంతంగా రాశారు, ఎంత శాతం ఇంటర్నెట్ లేదా ఇతర పత్రాల నుండి కాపీ కొట్టారు. మరియు ఏయే భాగాలను కృత్రిమ మేధ సాయంతో సృష్టించారు అనే విషయాలను ఇది కచ్చితత్వంతో విశ్లేషించి నివేదిక ఇస్తుంది. గడిచిన రెండేళ్ల కాలంలో ఓయూ అధికారులు దాదాపు 600 థీసిస్లను ఈ విధంగా పరిశీలించగా, వాటిల్లో భారీగా కాపీ కంటెంట్ ఉన్నట్లు తేలింది.
విద్యార్థులకు ఆచార్యుల హెచ్చరికలు
దీంతో ఆయా పత్రాలలో తగిన మార్పులు, చేర్పులు చేసి మళ్లీ తీసుకురావాలంటూ ఆచార్యులు విద్యార్థులను హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ హైదరాబాద్, మరియు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (UoH) లలో ప్రతి సంవత్సరం సగటున 1,700 మంది పరిశోధక విద్యార్థులు తమ పీహెచ్డీ థీసిస్లను సమర్పిస్తుంటారు.
టర్నిటిన్ సాఫ్ట్వేర్ ద్వారా జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు
అయితే, ఇటీవల ఈ టర్నిటిన్ సాఫ్ట్వేర్ ద్వారా జరిపిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. దాదాపు 40శాతం వరకు థీసిస్ కంటెంట్ కేవలం చాట్జీపీటీ వంటి ఏఐ టూల్స్ ద్వారా సృష్టించినట్లు తేలింది. మరో 5శాతం కంటెంట్ పాత పరిశోధనా పత్రాల నుండి యథాతథంగా సేకరించినట్లు స్పష్టమైంది. చాలామంది విద్యార్థులు కేవలం ఇంగ్లీష్ భాషా పదాల కూర్పు కోసమే ఏఐని వాడుతున్నామని చెప్తున్నప్పటికీ, అది సాంకేతికంగా 'కాపీ' కిందకే వస్తుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే సీటు రద్దు - మూడేళ్ల నిషేధం
ఇకపై ఇలాంటి కాపీరైట్ ఉల్లంఘనలను లేదా కృత్రిమ మేధ ఆధారిత పరిశోధనలను ఏమాత్రం సహించేది లేదని ఉస్మానియా వర్సిటీ గట్టిగా హెచ్చరించింది. అక్రమ మార్గాల్లో థీసిస్ సిద్ధం చేసి దొరికిపోతే, సదరు విద్యార్థుల పీహెచ్డీ సీటును రద్దు చేయడమే కాకుండా.. రాబోయే మూడేళ్ల పాటు దేశంలో ఎక్కడా కూడా ఎలాంటి పీహెచ్డీ ప్రవేశాలు పొందకుండా బ్లాక్లిస్ట్లో పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిశోధనలు అనేవి సమాజానికి ఉపయోగపడేలా, విద్యార్థి సొంత ఆలోచనలతో సాగాలే తప్ప డిజిటల్ కాపీలతో కాదని వర్సిటీ యాజమాన్యం తేల్చిచెప్పింది.












Click it and Unblock the Notifications