విషాదం: అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి, మరికొందరికి తీవ్రగాయాలు
హైదరాబాద్: అమెరికాలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు మరణించడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లినన నాలుగు నెలలకే రోడ్డు ప్రమాదంలో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మిత్రులతో కలిసి షాపింగ్కు వెళ్లి కారులో తిరిగివస్తున్నవారిని మరో కారు ఢీకొట్టడంతో హైదరాబాద్కు చెందిన ఎంఎస్ విద్యార్థి పీచెట్టి వంశీకృష్ణ(23) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఖమ్మంకు చెందిన పవన్(23) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నిజాంపేటలోని రెడ్డీస్ ఎవన్యూ కాలనీలో నివసించే ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ వరప్రసాద్, జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ పద్మజారాణి దంపతుల పెద్ద కుమారుడు శశికిరణ్ ఏడేళ్ల కిందట ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
చిన్నకుమారుడు వంశీకృష్ణ గత సంవత్సరం బీటెక్ పూర్తి చేసి, గత డిసెంబర్ 28న యూఎస్ వెళ్లాడు. అక్కడి సదరన్ ఇల్లినాయిస్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నారు. కాగా, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం.. ఏప్రిల్ 22న సాయంత్రం 5.30గంటలకు) 10 మంది విద్యార్థులు రెండు వేర్వే రు కార్లలో షాపింగ్కు వెళ్లారు.
ఈ క్రమంలో తిరిగివస్తుండగా చికాగో రోడ్డు మరో కారులో వచ్చిన ఓ మహిళ వీరి కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నడుపుతున్న పవన్, వెనక కూర్చున్న వంశీకృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. కళ్యాణ్, కార్తీక్, శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కళ్యాణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు విద్యార్థుల మృతి సమాచారం అందడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.