కేటీఆర్ ఫాంహౌస్ వివాదం: ఎయిర్పోర్టులో రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫాంహౌస్ పై డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరణ చేసిన కేసులో రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.
శంషాబాద్ విమాశ్రయంలో అరెస్ట్
రేవంత్ రెడ్డితోపాటు మరో ఐదుగురుని కూడా అరెస్ట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. లోక్ సభ సమావేశాలకు హాజరై ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు వాడాంరటూ..
నార్సింగి పోలీస్ స్టేషన్లో రేవంత్ రెడ్డిని విచారిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించిన నేపథ్యంలోనే అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయం వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి అనుచరులు, అభిమానులు అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు.
రేవంత్, అతని సోదరుడితోపాటు ఐదుగురి అరెస్ట్
రేవంత్ రెడ్డితోపాటు కొండల్ రెడ్డిపై ఎయిర్ క్రాఫ్ట్ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. సెక్షన్ 184, సెక్షన్ 187 కింద కేసులు నమోదు చేశారు. మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి ఉప్పరపల్లి న్యాయస్థానానికి తరలించారు. కాగా, రేవంత్ రెడ్డి అరెస్ట్ విషయం తెలియడంతో ఓయూ జేఏసీ నేత మానవతారాయ్, రేవంత్ రెడ్డి మిత్రమండలి సభ్యులు, అనుచరులు, అభిమానులు నార్సింగి పోలీస్ స్టేషన్ వైపు తరలి వెళుతున్నారు.
కేటీఆర్ ఫౌంహౌస్ వద్దకు మీడియాను తీసుకెళ్లిన రేవంత్
మూడు రోజుల క్రితం(సోమవారం) రేవంత్ రెడ్డి.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడలో 111జీవో పరిధిలో ఉన్న కేటీఆర్ ఫాంహౌస్ ను పరిశీలించేందుకు మీడియాతో కలిసి వెళ్లారు. మంత్రి కేటీఆర్ బినామీ పేర్లతో ఫాంహౌస్`లో అక్రమంగా కట్టడాలు కడుతూ, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారని.. ఈ కట్టడాలను వెంటనే కూల్చాలనే డిమాండ్ చేశారు. మీడియాను కూడా అక్కడికి తీసుకెళ్లి చూపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. కాగా, భద్రతా కారణాలరీత్యా ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు.