జానా, ఉత్తమ్లకు చుక్కలే: కోమటిరెడ్డికి కాంగ్రెసు పగ్గాలు?
తెలంగాణ పార్టీలో సమూలమైన మార్పులు తేవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత నాయకత్వం తీరు పట్ల కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ పార్టీలో సమూలమైన మార్పులు తేవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత నాయకత్వం తీరు పట్ల కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని నొప్పించకుండా పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవీ కాలం అక్టోబర్లో ముగుస్తుంది. ఆ సమయంలోనే వ్యవస్థాగతమైన మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో యువనాయకుడు, ఎమ్మెల్సీ కోమటిరెడ్జి రాజగోపాల్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవిలో నియమించాలని భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
అదే సమయంలో మొత్తం అధికారం ఒక్క వర్గం చేతులోనే ఉండకుండా చూసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) నేతగా ప్రస్తుతం కె. జానారెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో మల్లు భట్టి విక్రమార్కను నియమించాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే ఎందుకు....
కెసిఆర్ను ఢీకొట్టడానికి బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతనే పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెసు జాతీయ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొలగించాల్సి వస్తే రాజగోపాల్ రెడ్డికి ఆ పదవి దక్కవచ్చునని అంటున్నారు. ఇటీవల రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసినట్లు తెలుస్తోంది. పార్టీ పరిస్థితి ఏం మాత్రం బాగాలేదని సమూలమైన మార్పులు తెస్తే తప్ప కెసిఆర్ను ఢీకొట్టడం సాధ్యం కాదని ఆయన రాహుల్ గాంధీతో చెప్పినట్లు సమాచారం. ఈ దిశగా రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

సొంత మీడియాతో ముందుకు...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మాత్రమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడే విధంగా బలమైన మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజ్ న్యూస్ను తీసుకుని నడిపిస్తున్నారు. దాన్ని ఇతర టీవీ చానెళ్లకు ధీటుగా రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో ఓ దినపత్రికను కూడా నడిపించాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో మన తెలంగాణ యాజమాన్యంతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం రాలేదని అంటున్నారు. దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం దినపత్రికను తీసుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కారణంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

జానా స్థానంలో మల్లు భట్టి...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా నియమిస్తే సిఎల్పీ నేతగా జానా రెడ్డిని కూడా మార్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జానా రెడ్డి స్థానంలో మల్లు భట్టి విక్రమార్కను సిఎల్పీ నేతగా నియమించవచ్చుననే ప్రచారం సాగుతోంది. దీనివల్ల దళిత సామాజికవర్గంలో విశ్వాసాన్ని పాదుకొల్పడం సాధ్యమవుతుందని అంటున్నారు.

పొన్నం ప్రభాకర్ ఇలా....
పిసిసి అధ్యక్షుడితో పాటు ఇద్దరు కార్యనిర్వాహక అధ్యక్షులను కూడా నియమించాలనే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బిసిల నుంచి ఒకరిని, మైనారిటీల నుంచి మరొకరిని నియమించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఒకరు, దక్షిణ తెలంగాణ నుంచి ఒకరు ఉంటారని సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి పొన్నం ప్రభాకర్కు అవకాశాలున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో పొన్నం ప్రభాకర్ కీలకమైన పాత్ర పోషించినందున ఆ అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications