టీఆర్ఎస్ కొత్త మోసం, మనుషులను తరలిస్తున్నారు: వీహెచ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షం, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆదరణ ఉందని చెప్పుకునేందుకు టీఆర్ఎస్ పార్టీ మనుషులను తరలిస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వీహెచ్ తార్నాక డివిజన్లో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘటన సోనియా గాంధీదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. అయితే ఆ అభివృద్ధిని తామే చేశామంటూ టీఆర్ఎస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ కొత్త మోసానికి తెరతీసిందని ఆయన మండిపడ్డారు. ఎప్పుడో పూర్తి కావాల్సిన మెట్రో ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడానికి కారణం టీఆర్ఎస్ పార్టీయే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కోరుకునే వారు గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
బీజీపీ-టీడీపీ కూటమితోనే హైదరాబాద్ అభివృద్ధి: కేంద్రమంత్రి హన్సరాజ్
బీజేపీ, టీడీపీ కూటమి ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర సహాయ మంత్రి హన్సరాజ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జంగమ్మెట్, శాలిబండ డివిజన్ల బీజేపీ అభ్యర్థులు కౌడీ మహేందర్, పొన్న వెంకటరమణలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో బీజేపీ, టీడీపీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలకు తగిన రీతిలో ఓటు ద్వారా ప్రజలు సమాధానం చెప్పాలన్నారు.