వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు
హైదరాబాద్ నగరంలో కలకలం రేపిన దంత వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు.
హైదరాబాద్: నగరంలో కలకలం రేపిన దంత వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఇప్పటికే నవీన్ రెడ్డిపై ఆదిభట్ల పోలీస్ స్టేషన్లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వివరాలను రాచకొండ సీపీ చౌహాన్ వెల్లడించారు.
నవీన్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు సీపీ అధికారికంగా ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటికే నవీన్ రెడ్డితోపాటు 40 మందిపై కేసులు నమోదు చేశారు. వైశాలి ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాలతో.. వాటిని నవీన్ రెడ్డి షేర్ చేసినట్లు సీపీ తెలిపారు.
కిడ్నాప్ కేసు వివరాల్లోకి వెళితే.. మన్నెగూడకు చెందిన వైశాలికి అమెరికా పెళ్లి సంబంధం రావడంతో గత డిసెంబర్ 9న తల్లిదండ్రులు నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నవీన్ రెడ్డి.. వైశాలిని కిడ్నాప్ చేసేందుకు పెద్ద రచ్చే చేశాడు. ఆమెకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని నమ్మించి.. పదుల సంఖ్యలో తన అనుచరులతో వైశాలి ఇంటిపై దాడి చేశారు.

కర్రలు, రాడ్లతో నిలిపి ఉంచిన కార్లను ధ్వంసం చేశారు. నవీన్ రెడ్డిని అడ్డుకోబోయిన యువతి తండ్రి, బాబాయ్ పైనా దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి ఫర్నీచర్ కూడా ధ్వంసం చేశారు. బలవంతంగా వైశాలిని కారులో ఎత్తుకెళ్లాడు నవీన్ రెడ్డి. ఈ ఘటన నగరంలో అప్పుడు పెద్ద సంచలనంగా మారింది.
యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చివరకు వైశాలిని క్షేమంగా ఇంటికి చేర్చిన పోలీసులు.. నవీన్ రెడ్డితోపాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. తాను, వైశాలి ప్రేమించుకున్నామని, పెళ్లికి ఆమె తల్లిదండ్రులు అడ్డుకుంటున్నారని నవీన్ చెప్పాడు. అంతేగాక, తన డబ్బులు వైశాలి వాడుకుందని చెప్పాడు. కానీ, తాను నవీన్ రెడ్డిని ప్రేమించలేదని, తనకు పరిచయం మాత్రమే ఉందని వైశాలి తెలిపింది. అతడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. తనకు ఇష్టం లేకుండానే తనను కిడ్నాప్ చేశారని వెల్లడించింది.












Click it and Unblock the Notifications