సికింద్రాబాద్ - విజయవాడ వందేభారత్ : దారి మళ్లింది - కొత్త ట్విస్ట్..!?
వందేభారత్ తెలుగు రాష్ట్రాలకు ఇప్పట్లో లేదా. ఈ నెలలోనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభించేందుకు కసరత్తు జరిగింది. దక్షిణ మధ్య రైల్వే అధికారులకు అధికారికంగా సమాచారం అందింది. కానీ, ఈ నెల ముగుస్తోంది. వందేభారత్ ఊసే లేదు. సికింద్రాబాద్ - విజయవాడ మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేభారత్ నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించి ట్రాక్ పరిశీలన .. సమయం నిర్ణయం పైన చర్చలు జరిగాయి. అవకాశం ఉంటే ప్రధానితో వర్చ్చువల్ గా ప్రారంభించాలనే ప్రతిపాదన వచ్చింది. కానీ, ఇప్పుడు ఈ రైలు ప్రారంభం పైన కొత్త సందేహాలు మొదలయ్యాయి.
సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందేభారత్
దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకు వందేభారత్ రైలు మంజూరు అయింది. గత నెలలోనే దీనికి సంబంధించి రైల్వే ఉన్నతాధికారుల నుంచి దక్షిణ మధ్య రైల్వేకు సమాచారం అందింది. కొత్త సంవత్సరం కానుకగా ఈ నెలాఖరులో ప్రారంభించేలా ప్రయత్నాలు జరిగాయి. నాలుగు గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి విజయవాడ చేరుకొనేలా షెడ్యూల్ పైన కసరత్తు చేసారు.
ఇప్పటికే పలు రైళ్లు ఈ మార్గంలో ఉన్నా.. ప్రయాణీకుల రద్దీతో వందేభారత్ ద్వారా ప్రయోజనం ఉంటుందని అధికారులు నివేదించారు. దీనికి ఆమోదం లభించటం.. ట్రాక్ పరిశీలన జరగటంతో త్వరలోనే వందేభారత్ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభం అవుతుందని అంచనా వేసారు. కానీ, ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన వందేభారత్ దారి మళ్లింది. పశ్చిమ బెంగాల్ కు ఆ రైలు మళ్లించినట్లు తెలుస్తోంది.
బిలాస్ పూర్ కు మళ్లించారంటూ..
సికింద్రాబాద్ - విజయవాడ మధ్య ప్రారంభించాల్సిన వందేభారత్ రైలు పైన ఇప్పుడు సందేహాలు మొదలయ్యాయి. దక్షిణ మధ్య రైల్వేకు రైల్వే బోర్డు చెప్పిన విధంగా తొలుత వందేభారత్ ఖరారైంది. అధికారులు దాదాపు 30 మంది సిబ్బందికి ఈ రైలు నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఈ రైళ్లు నడుస్తున్న ప్రాంతాలకు కూడా వెళ్లి వారు శిక్షణ తీసుకొని వచ్చారు.
ఇక ఈవారంలో లేదా జనవరి మొదటి వారంలో వందేభారత్ తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయటం ఖాయమని అందరూ భావించారు. కానీ, తాజాగా రైల్వే ఉన్నతాధికారులు తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన వందేభారత్ ను నాగపూర్- బిలాస్పూర్ సెక్షన్కు తరలించినట్లు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే ఆరు అంచెల్లో వందేభారత్ రైళ్లు పలు రాష్ట్రాలకు కేటాయించారు. ఏడో విడత కేటాయింపు జనవరి ద్వితీయార్ధంలో ఉంటుందని చెబుతున్నారు. అందులో తిరిగి సికింద్రాబాద్ - విజయవాడ రైలు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
తెలుగు ప్రజల నిరీక్షణ..
ఉత్తరాది నుంచి దక్షిణాదికి వెళ్లే రైళ్లకు సికింద్రాబాద్ ప్రధాన జంక్షన్. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం లక్షలాది మంది ప్రయాణం చేస్తుంటారు. విజయవాడ రైల్వే జంక్షన్ దక్షిణాది ప్రాంతాలన కలిపే మరో కీలక స్టేషన్. దీంతో, సికింద్రాబాద్ - విజయవాడ మధ్య వందేభారత్ రైలు తీసుకురావటం ద్వారా తెలుగు ప్రయాణీకులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించారు.
కానీ, ఇప్పుడు ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందేభారత్ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ నెలాఖరు నాటికి హైస్పీడ్ రైలు అందుబాటులో వస్తుందని భావించినా.. ఎప్పుడు సాధ్య పడుతుందనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.