'హరీష్! చంద్రబాబును తిట్టడం కాదు, నిధులిస్తే ప్రాజెక్ట్లు మేమే కట్టిస్తాం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడితే ఏపీ అడ్డు తగలకుండా చూసే బాధ్యత తమదేనని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి శుక్రవారం అన్నారు. టిఆర్ఎస్ సర్కారు నిధులిస్తే తాము ప్రాజెక్టులు కట్టిస్తామని చెప్పారు.
ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే దిగువ రాష్ట్రాలు అడ్డుపడిన చరిత్ర లేదన్నారు. ఇందుకు ఉదాహరణ అల్మట్టి, బాబ్లీ ప్రాజెక్టులే అన్నారు. మంత్రి హరీష్ రావుకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తిట్టడంపై ఉన్న శ్రద్ధ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసే అంశంపై లేదన్నారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు.
ఓట్లు తొలగిస్తున్నారు
తెలంగాణ రాష్ట్రం విపక్షాలకు చెందిన ఓట్లను తొలగిస్తోందని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఓట్లు తొలగిస్తున్నారని మండిపడుతోంది. హైదరాబాదులోని పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించింది.
టిఆర్ఎస్ ప్రజల ప్రభుత్వం: మంత్రి కేటీఆర్
టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం అన్నారు. మంచాల మండలంలో స్వయం సహాయక సంఘాలకు రుణమేళా - ఆస్తుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఉన్నది ప్రజలకు సేవ చేసేందుకే అన్నారు.
మహిళలకు ఇచ్చే వడ్డీ లేని రుణాలను త్వరలో రూ.10 లక్షలకు పెంచుతామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 37 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామన్నారు. మనిషికి 6 కిలోల రేషన్ బియ్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని చెప్పారు.
గౌరవంగా ఉండాలనే స్థానిక ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ గౌరవ వేతనం పెంచారన్నారు. గ్రామ పంచాయతీలు 50 శాతం వరకు నిధులు ఖర్చు చేసుకునేలా త్వరలో జీవో తీసుకొస్తామన్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నారు.