కేసీఆర్ను ఓడించి, గజ్వెల్ను సోనియా గాంధీకి బహుమతిగా ఇస్తా: వంటేరు సవాల్
Recommended Video
హైదరాబాద్/మేడ్చల్: హైదరాబాద్ పరిసర ప్రాంత మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ బహిరంగ సభలో ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీకి రాకకు ముందు పలువురు నేతలు ఈ సభలో ప్రసంగించారు. వారు కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు.
కనీసం ప్రతిపక్షానికి కావాల్సిన సీట్లు కూడా రావని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే తనను గెలిపిస్తే పని చేస్తా లేదంటే ఇంట్లో రెస్ట్ తీసుకుంటానని చెప్పారని కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డి అన్నారు. కేసీఆర్ను ఫాంహౌస్లో రెస్ట్ తీసుకునేలా చేసే వ్యక్తి గజ్వెల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి అని చెప్పారు.
ఆర్థిక నేరగాడిని వదలం: కేటీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి, హెచ్చరికలు
కేసీఆర్ సీఎం అయ్యేవారా?
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగున్నరేళ్లలో ఎవరికీ న్యాయం చేయలేని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నాలుగేళ్ల క్రితం చేసిన సమగ్ర సర్వే ఏమయిందని ప్రశ్నించారు.
గజ్వెల్లో కేసీఆర్ను ఓడించి, బహుమతి ఇస్తా
ప్రగతి భవన్, నీ ఇంటి నిండా నౌకర్లు కావాలా కేసీఆర్ అని వంటేరు నిలదీశారు. డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. గజ్వెల్లో కేసీఆర్ను ఓడించి, సోనియా గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బహుమతిగా ఇస్తానని చెప్పారు. ఓ నియంతను, ఓ శాడిస్ట్ అని నిప్పులు చెరిగారు. అందరం చేయి చేయి కలిపి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, కేసీఆర్ను గద్దె దించాలన్నారు. ఖమ్మంలో రైతులు తిరగబడితే సంకెళ్లు వేశారన్నారు. కవిత బతుకమ్మ పేరుతో దోచుకున్నారని చెప్పారు.
కూటమిని గెలిపించాలి
ఉద్యోగం రావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆర్ కృష్ణయ్య అన్నారు. మహాకూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. మన పిల్లలు బాగుపడాలంటే కేసీఆర్ పాలనకు అంతం పలకాలని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారని, కానీ కనీసం ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4600 స్కూళ్లను మూసివేశారని చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పారు.
నష్టపోతామని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు
ఓవైపు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన తల్లి సోనియా గాంధీ అని సంపత్ కుమార్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఓ నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలన అప్రజాస్వామికంగా సాగిందన్నారు. సమానత్వం లేకుండా, స్వేచ్ఛ లేకుండా, అవినీతితో, కుటుంబ పాలనగా సాగిందని చెప్పారు. తెరాస పాలనలో ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. తెలంగాణ ఎందుకు సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు.