ఓటుకు నోటులో ఎసిబి ఎదుట వేం కొడుకు కృష్ణ: బెంగళూరులో టెక్కీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వేం నరేందర్ రెడ్డి తనయుడు కృష్ణ కీర్తన్ రెడ్డి బుధవారం నాడు ఎసిబి ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనకు ఎసిబి మంగళవారం సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన బుధవారం విచారణకు హాజరయ్యారు.
ఓటుకు నోటు కేసులో ఎ1గా రేవంత్ రెడ్డి, ఎ2 సెబాస్టియన్, ఎ3 ఉదయ్ సిన్హా, ఎ4 జెరూసలేం మత్తయ్య ఉన్నారు. సండ్ర వెంకట వీరయ్యను ఎ5గా పేర్కొన్నారు.
కాగా, కేసులో లభించిన ఫోన్ సంభాషణలను ఫోరెన్సిక్ ల్యాబ్లో పరీక్షించిన మీదట ఎసిబికి పలు కీలక ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది. కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం వెల్లడైందని తెలుస్తోంది. ఈ ఆధారాలతో విచారణ నిమిత్తం కృష్ణ కీర్తన్కు నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, కృష్ణ కీర్తన్.. వేం నరేందర్ రెడ్డి తనయుడు. అతను సాఫ్టువేర్ ఇంజినీర్గా పని చేస్తున్నారు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు.
వేం నరేందర్ రెడ్డిని ఇంతకుముందే అధికారులు విచారించారు. కృష్ణ కీర్తన్ నుంచి అధికారులు మరిన్ని విషయాలు రాబట్టనున్నారని తెలుస్తోంది. అతను రేవంత్, ఉదయ్ సిన్హాలతో మాట్లాడినట్లుగా ఎసిబి అధికారులు గుర్తించారని సమాచారం.