రాజకీయ వారసత్వమా?: కొడుకు, కూతురుపై వెంకయ్య ఇలా
రైతులు, మహిళలు, గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణభారత్ ట్రస్టు కృషి చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్: రైతులు, మహిళలు, గ్రామీణ యువత అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణభారత్ ట్రస్టు కృషి చేస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ముచ్చింతలలో స్వర్ణభారత్ ట్రస్టు శాఖ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ యువతకు స్వర్ణభారత్ ట్రస్టు శిక్షణ ఇస్తోందన్నారు.
యువత ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరగకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లు తీసుకోవడం లేదని తెలిపారు. రాజకీయాలకు ట్రస్ట్లో స్థానం లేదని స్పష్టం చేశారు.
వెంకయ్య కూతురుపై కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
దేశంలో ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని.. అలాంటి పరిస్థితుల్లో చిన్నచిన్న ఇబ్బందులు తప్పవన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలుకాకుండా.. దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించాలన్నారు. కన్నతల్లి, మాతృభాష, జన్మభూమిని మర్చిపోకూడదని, మర్చిపోతే అలాంటి వారు మనిషే కాదని అన్నారు.
ప్రభుత్వాల కోసం ఎదురుచూడకుండా స్వచ్ఛంద సంస్థలు తమ బాధ్యతలను నెరవేర్చాలని ఈ సందర్భంగా వెంకయ్య పిలుపునిచ్చారు. స్వర్ణభారతి ట్రస్టులో బోధన ఆంగమైనా.. భావన భారతీయమేనని చెప్పారు.
రాజకీయ వారసత్వం లేదు..
రాజకీయాల్లో మార్పులు రావాలని వెంకయ్య అన్నారు. తనకు రాజకీయ వారసత్వం లేదని.. జవసత్వం మాత్రమే ఉందని చెప్పారు. తనకు రాజకీయాల్లో వారసులు లేరని.. కొడుకు, కుమార్తె రాజకీయాల్లోకి వస్తానంటే తాను ప్రోత్సహించనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
తన కొడుకు ఒడ్డు పొడవుతో ఆకర్షణీయంగా ఉంటాడని.. పలువురు అతడ్ని రాజకీయాల్లోకి తీసుకురావచ్చుగా.. అని తనతో అంటే తాను అందుకు నిరాకరించానని తెలిపారు. వారసత్వ రాజకీయాలు తగవని అన్నారు. తన కూతురు కూడా సమాజసేవకే పరిమితమైందని అన్నారు. రాజకీయ వారసులు ఉండకూడదని ఆయన అన్నారు.
మన దేశానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని.. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల యువతకు చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. మహానుభావుల గొప్పదనాన్ని పిల్లలకు చెప్పాలన్నారు. కిస్ ఫెస్టివల్, బీఫ్ ఫెస్టివల్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు.
అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గ్రామీణ యువతీయువకుల్లో స్వర్ణభారత్ ట్రస్టు చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. మహాత్ముడి కలల సాధన కోసం స్వర్ణభారత్ ట్రస్టు కృషి చేస్తోందన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే ఇలాంటి ట్రస్టులు చాలా అవసరమన్నారు. యువత ఉపాధి కల్పనకు కేంద్రం రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తోందన్నారు. మానవ వనరులు పుష్కలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు.