స్మార్ట్సిటీలపై టిఆర్ఎస్ ప్రశ్న: చూసుకోండి.. ఘాటుగా స్పందించిన వెంకయ్య
హైదరాబాద్/న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల విషయంలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిందని తెలంగాణ సీఎం కెసిఆర్, మంత్రి కెటి రామారావులు గురువారం విమర్శించారు. ఏపీకి రెండు స్మార్ట్ సిటీలు మంజూరు చేసిన కేంద్రం తెలంగాణకు ఇవ్వకపోవడాన్ని గ్రేటర్ ఎన్నికల్లో కెటిఆర్ ప్రస్తావించారు.
మిగతా రాష్ట్రాల్లోను కొన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. స్మార్ట్ సిటీల ఎంపికపై వ్యాఖ్యలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని వెంకయ్య నాయుడు హితవు పలికారు.
స్మార్ట్ సిటీల తొలి జాబితాపై వస్తున్న విమర్శలపై ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా స్పందించారు. కేంద్రం నిర్దేశించిన ప్రాతిపదికలు, ఆయా నగరాలు అందిస్తున్న సదుపాయాలు, సంస్కరణలు, నిధుల సమీకరణ, ప్రజల భాగస్వామ్యం ఆధారంగా సంబంధిత నగరాలు పంపిన ప్రతిపాదనలు పరిశీలించి తొలి జాబితాలో 20 నగరాల ఎంపిక జరిగిందన్నారు.
కేంద్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు తొలి విడత ఆర్థిక సాయం ఈ నగరాలకు అందుతుందన్నారు. రాష్ట్రాలు పంపిన జాబితాలో మిగిలిన నగరాలు వాటి ర్యాంకింగ్ ఆధారంగా తదుపరి జాబితాల్లో చోటు సంపాదిస్తాయని తెలిపారు. రాష్ట్రాలు ప్రతిపాదించిన 97 నగరాలను స్మార్ట్ సిటీల జాబితా నుంచి తొలగించలేదని వెల్లడించారు.
ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా ఎంపిక జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ (వారణాసి), ఆర్థిక మంత్రి జైట్లీ (అమృత్సర్), విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ (విదిశ), పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సొంత ఊరు నెల్లూరు ఈ జాబితాలో లేవని, ఇదే పారదర్శకతకు నిదర్శమని పేర్కొన్నారు.
ఉత్తర ప్రదేశ్, బీహార్ సహా 16 రాష్ట్రాల్లోని నగరాలు ఈ జాబితాలో చోటు సంపాదించుకోలేదని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. నగరాల ఎంపిక ప్రాతిపదికలను అంతర్జాలంలో ఉంచామని, వాటిని చూడాలని వెంకయ్య చెప్పారు.
\స్మార్ట్ సిటీల ఎంపికను తాము చేయలేదని వెంకయ్య చెప్పారు. ప్రపంచ, జర్మన బ్యాంకు, ఐఐయుఏ ఎంపిక చేశాయన్నారు. మూడు ప్యానెళ్లు స్మార్ట్ సిటీల ఎంపికను చేపట్టాయన్నారు. స్మార్ట్ సిటీల కోసం నాడు కేంద్రం కేవలం మార్గదర్శకాలు మాత్రమే జారీ చేసిందని, ఈ స్మార్ట్ సిటీల ఎంపిక కోసం పాటించాల్సిన ప్రమాణాలు కూడా చెప్పామన్నారు. మెరిట్ ప్రాతిపదికన నగరాల ఎంపిక జరిగిందన్నారు.