పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు: విహెచ్, టీ న్యూస్కు నోటీస్పై టీ టిడిపి నేతలు
హైదరాబాద్: అవినీతిని ప్రశ్నిస్తానన్న తెలుగు చలనచిత్ర నటుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని కాంగ్రెసు తెలంగాణ నేత వి. హనుమంతరావు ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడదు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పో ఒప్పో పవన్ కళ్యాణ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని ఆయన శనివారంనాడు మీడియాతో అన్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఇటువంటి చర్యలకు చంద్రబాబు పాల్పడడం సరి కాదని ఆయన అన్నారు.
ఐపిఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ వ్యవహారంలో సుష్మా స్వరాజ్, వసుంధర రాజే, ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబు అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించకపోవడం సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు కాంగ్రెసు నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ సిబిఐ చేత విచారణ జరిపిస్తున్న కేంద్రం ఎన్డీఎ నేతలను ఎందుకు విచారించడం లేదని అడిగారు.
కాగా, టీ న్యూస్ చానెల్కు ఇచ్చిన విశాఖపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబును కోరినట్లు సమాచారం. నోటీసులు ఉపసంహరించుకోకపోతే జర్నలిస్టులతో తమకు ఇబ్బందులు ఎదురువుతాయని వారు చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబుతో శనివారం ఉదయం గరికపాటి రామ్మోహన్ రావు, వేం నరేందర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు భేటీ అయ్యారు. శుక్రవారం అర్థరాత్రి టీ న్యూస్ చానెల్కు ఆంధ్ర పోలీసులు నోటీసు జారీ చేసిన విషయంపై వారు చంద్రబాబుతో మాట్లాడినట్లు తెలుస్తోంది.