టిడిపికి విహెచ్ ఆఫర్: చంద్రబాబునే కాదు.. దేవుడ్నేఎదిరిస్తా: కృష్ణయ్య
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు బంపర్ ఆపర్ ఇచ్చారు! తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదేనని, టిడిపి నేతలు తమ పార్టీలో చేరితే మంచిదని ఆయన సూచించారు.
బుధవారం విహెచ్ విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ కాలం నడుస్తోందని, భవిష్యత్తు మాత్రం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా రైతులకు భరోసా కల్పించేలా ప్రకటన చేయాలన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యులు ఎవరో తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగాలని విహెచ్ విలేకరులకు సూచించారు.
రైతులను ఆదుకోవడానికి సినిమా పరిశ్రమ ముందుకు రావాలని మరో కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్జీవోల ద్వారా రైతులకు సాయం అందించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తన ఖమ్మం జిల్లా పర్యటనలో ముంపు బాధితుల అంశాన్ని ప్రస్తావించలేదని ఆరోపించారు.
రాహుల్.. యాకూబ్ అని పేరు పెట్టుకోవాలి: కిషన్ రెడ్డి
దేశ భద్రతకు భంగం కలిగేలా కాంగ్రెస్, వామపక్షాల తీరు ఉందని తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఉగ్రవాదులకు మద్దతుగా ఉద్యమాలు దేశ సమగ్రతకు భంగమన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల వైఖరితో ప్రజలు విసిగిపోతున్నారన్నారు.
పాకిస్తాన్ అనుకూల నినాదాల పైన ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తీవ్రవాదులకు అనుకూలంగా కాంగ్రెస్ తన విధానాలు మార్చుకుందా చెప్పాలని నిలదీశారు. రాహుల్ గాంధీ తన పేరును యాకూబ్గా పెట్టుకోవాలని సూచించారు. ఈ నెల 19, 20, 21వ తేదీలలో జన స్వాభిమాన్ ర్యాలీలు చేపట్టనున్నట్లు తెలిపారు.
అవసరమైతే దేవుడ్ని ఎదిరిస్తా: ఆర్ కృష్ణయ్య
బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబునే కాదు.. అవసరమైతే దేవుడినైనా ఎదిరిస్తానని తెలంగాణ ప్రాంత టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బుధవారం రాజమండ్రిలో అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర, రాష్ట్రాలు రిజర్వేషన్ల పవిత్రతను చెడగొడుతున్నాయన్నారు.