రెచ్చిపోయిన వీహెచ్.. గాంధీ భవన్ ను షేక్ చేసిన వ్యాఖ్యలు..! బిత్తరపోయిన సొంత పార్టీ నేతలు!
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు మరో సారి రెచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీలో నేతల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. గాంధీభవన్లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో పార్టీ నేతల తీరును ఆయన కడిగిపారేశారు. ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న సమాచారం తెలిసినప్పుడే దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా... వాళ్లంతా వెళ్లిపోయాక సమావేశాలు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? అని ప్రశ్నించారు.
19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకముందే పిలిచి మాట్లాడి ఉండాల్సిందని హితవుపలికారు. అంతా అయిపోయాక సమావేశాలు పెట్టడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదన్నారు. ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఒక్కడే తిరగడమేంటి? అని నిలదీశారు. సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లాల్సిన అవసరం లేదా? అని అడిగారు.
మరోసారి కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. ఇంటర్ విద్యార్థుల పేరెంట్స్ దీక్షలో వీహెచ్ , నగేష్ ఫైటింగ్
పార్టీ క్యాడర్కు ఏం సంకేతాలు ఇస్తున్నారని రుసరుసలాడారు. అసెంబ్లీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా ఇలానే చేశారన్నారు. మనవాళ్లను పంపేసి.. కొత్త వాళ్లను తీసుకోవడమేంటన్నారు. వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన కొంతమందికి అధిష్టానం టికెట్లు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆదిలాబాద్, పెద్దపల్లి, కోరుట్లలో కూడా ఒకే సామాజిక వర్గానికి టికెట్లు ఇచ్చారని.. ఇలా ఎందుకు చేశారని నిలదీశారు.
పార్టీకి నష్టం చేకూర్చేలా ఇలా ఎందుకు చేస్తున్నారని ఆవేశంగా మాట్లాడి.. సమావేశం నుంచి అర్థాంతరంగా లేచిపోయి ఇందిరాపార్కులో జరుగుతున్న ధర్నాకు వెళ్లిపోయారు. కాగా సొంత పార్టీపై వీహెచ్ చేసిన వ్యాఖ్యలతో నేతలు కంగుతిన్నారు. అసలు ఆయన మాటల వెనుక ఆంతర్యమేంటి..? ఎవరిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా మాట్లాడారు.? అని సొంత పార్టీ నేతలు ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.