సిఎల్పీ మీట్: విహెచ్ గరం, కోమటిరెడ్డి డుమ్మా
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు నాయకత్వంపై అసంతృప్తుల వెల్లువ పెల్లుబుకుతోంది. తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్షం (టిఎస్ఎల్పీ) సమావేశం నిర్వహణ తీరుపై కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు మండిపడ్డారు. టిఎఎస్ఎల్పీ సమావేశం ఉందని మాత్రమే సమాచారం ఇచ్చారని, సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించలేదని ఆయన అన్నారు.
శాసనసభ్యులు పార్టీని వీడుతుంటే కాంగ్రెసు శ్రేణుల్లో ఆత్మస్థయిర్యం దెబ్బ తింటోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వలసలను కట్టడి చేయడం పార్టీని బలోపేతం చేయడంపై ప్రస్తుత, మాజీ పార్లమెంటు సభ్యులను ఈ నెల 9వ తేదీన ప్రత్యేకంగా భేటీ అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో టిఎస్ఎల్పీ సమావేశమైంది.
వచ్చే ఐదేళ్లలో కాంగ్రెసు పార్టీ పుంజుకుంటుందని విహెచ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెసును తిరిగి అధికారంలోకి తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వలసలు పార్టీలో నైరాశ్యాన్ని నింపాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదిలావుంటే, తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటైన టిఎస్ఎల్పీ సమావేశానికి నల్లగొండ కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. తెలంగాణ కాంగ్రెసు నాయకత్వం తీరుపై విమర్శలు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఆయన గత కొద్ది రోజులుగా బాసట పలుకుతున్న విషయం తెలిసిందే.
సోమవారం జరిగిన సమావేశానికి ఎఐసిసి పరిశీలకుడు కుంతియా, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, పార్టీ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెసు సిద్ధమవుతోంది.