కేసీఆర్కు 100 సీట్లు కాదు, 104 జ్వరం వస్తుంది: విజయశాంతి, నేనే టీడీపీలో ఉంటే: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా వస్తాయని చెప్పిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రచార రథసారథి విజయశాంతి సోమవారం కౌంటర్ ఇచ్చారు.
సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే, నువ్వు గెలుస్తున్నావ్.. లక్కీ, అదే జగన్ కొంపముంచింది: కేసీఆర్ జాగ్రత్తలు
ఎన్నికల తర్వాత వంద సీట్లు రావడం కాదని, కానీ కేసీఆర్కు 104 జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు. అలాగే, మహాకూటమిలోని పార్టీలు సీట్లు అడగడంపై కూడా ఆమె స్పందించారు.
ఓడిపోయే స్థానాలు కోరవద్దు
పొత్తులో భాగంగా సీట్లు గెలవడానికి అడగాలని కానీ కాంగ్రెస్ గెలిచే స్థానాలను లాక్కొని, మన కూటమి ఓడిపోయేలా చేయవద్దని హితవు పలికారు. రేపు (మంగళవారం) సాయంత్రం ప్రజా కూటమి చర్చలు ఉంటాయన్నారు. ఒకటి రెండు రోజుల్లో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రానుందని చెప్పారు. కాంగ్రెస్ గెలిచే సీట్లు గుంజుకోవద్దని చెప్పారు.
నేను టీడీపీలో ఉంటే వంద శాతం ఆ పార్టీకే అవకాశం
తాను తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే తెలంగాణలో ఆ పార్టీకి వంద శాతం అవకాశం ఉండేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ తాజా మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా భయపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను చంద్రబాబును సమర్థిస్తూ మాట్లాడలేని పరిస్థితి అని రేవంత్ రెడ్డి చెప్పారు.
చంద్రబాబు అంటే కేసీఆర్కు భయం
చంద్రబాబును టార్గెట్ చేసి పొత్తుల గురించి విమర్శిస్తున్నారంటే కేసీఆర్ ఎంతలా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చునని రేవంత్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎగిరెగిరి దంచినా అంతే కూలి అని, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఓ సామెత చెప్పారు. కాంగ్రెస్లో ఎదగాలనుకునే వాళ్లకు అవకాశముందని, అయితే పార్టీలో ఎవరు ఎలా కావాలంటే అలా ఉండే స్వేచ్ఛ కూడా ఉందన్నారు. ఎదగాలనుకునే వాళ్లు ఎదగొచ్చని, పడిపోయేవాళ్లు పడిపోవచ్చని, నేర్చుకునే వాళ్లు నేర్చుకోవచ్చునని చెప్పారు.
ఐటీ సోదాలపై రేవంత్ రెడ్డి
ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి సమయంలో తాను ఎలాంటి ఒత్తిడిగి గురి కాలేదని, ఐటీ అధికారులే ఒత్తిడికి లోనయ్యారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏమీ దొరకనందున ఏ కేసు పెట్టాలా అనే ఒత్తిడిలో ఉండిపోయారని చెప్పారు. తాను తన సోదరులతో కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేశానని, అందుకు తగిన ట్యాక్స్ కట్టానని, అక్రమ సంపాదన లేదని చెప్పారు. తన ఆస్తి పరిమితిలో ఉందని ఐటీ ఆధికారులు రాశారని, చివరగా ఓటుకు నోటు కేసుకు సంబంధించిన రూ.50 లక్షల గురించి అడిగారని చెప్పారు.