విజయశాంతి వ్యాఖ్యలతో కాంగ్రెస్ లో బయటపడిన అంతర్గత కుమ్ములాటలు .. టీ కాంగ్రెస్ కు కష్టమేనా ?
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా పావులు కదుపుతున్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష అంటుంది. అందులో భాగంగా కాంగ్రెస్, టిడిపి, టిఆర్ఎస్ పార్టీ నుండి నాయకులను బిజెపిలో చేసుకునే పనిలో పడింది. ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి కూడా బిజెపి బాటపట్టారు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగింది. ఇటీవల కాలంలో బిజెపి తీసుకుంటున్న నిర్ణయాలతో విజయశాంతి ఏకీభవించడం బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలకు అనుకూలంగా ఆమె స్పందించడం వంటి కారణాలతో ఆమె పార్టీ మారుతున్నారు అన్న భావన చాలా మంది రాజకీయ నాయకుల్లో కలిగింది. ఇక అలాంటిదేమీ లేదని చెప్పిన విజయశాంతి సొంత పార్టీ నేతలపైన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలను మరోసారి తెరమీదకు తెచ్చింది .

విజయశాంతి వ్యాఖ్యలతో బయటపడ్డ పార్టీ అంతర్గత కలహాలు
విజయశాంతి పార్టీ మారుతున్నారని జోరుగా సాగిన ప్రచారంపై రాములమ్మ క్లారిటీ ఇచ్చేశారు. తన మీద జరుగుతున్న ప్రచారానికి గల కారణాలను ఆమె కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు.కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పార్టీ మారుతారని సాగిన ప్రచారం పై స్పందించిన విజయశాంతి తనకు పార్టీ మారే ఆలోచన ఏమాత్రం లేదని, ఒకవేళ అలా ఉంటే బహిరంగంగా ప్రకటించిన తర్వాతే వెళతానని పేర్కొన్నారు. గాంధీభవన్లో కొందరు తనపై కావాలని కుట్ర చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారన్న వార్తలను ఖండించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను పార్టీ మారుతున్నానన్న ప్రచారం గాంధీ భవన్ లోనే ప్రారంభమైందని ఆరోపించారు. పార్టీ విడిచి వెళ్లాలనుకుంటే బహిరంగంగానే ప్రకటిస్తానన్నారు. ఇక ఇదే విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా స్పష్టంగా చెప్పానని పేర్కొన్న విజయశాంతి తానెప్పుడూ హడావుడి నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు .
ఈ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విబేధాలు బాహాటంగా చెప్పారు విజయశాంతి . విజయశాంతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని ఆమె వ్యాఖ్యానించటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.

విజయశాంతి బీజేపీ అనుకూల వ్యాఖ్యల వల్లే పార్టీ మారాతారనే ప్రచారం జరిగిందనే భావన
గతంలో విజయశాంతి బీజేపీలో పని చేయడం, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బాగా బలహీనపడటం, బిజెపి బలం పుంజుకోవడం, ఇక తాజాగా విజయశాంతి చేస్తున్న పోస్టులు అన్నీ విజయశాంతి పార్టీ మారతారని అభిప్రాయానికి ఊతం ఇచ్చాయి. ఇటీవల ఇక తమ జోలికి ఎవరూ రాకుండా ఉండాలని అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించిందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని విజయశాంతి చెప్పటం, కేసీఆర్ ప్రభుత్వంలోని అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొనటం కూడా విజయశాంతి బీజేపీ విషయంలో అనుకూలంగా ఉన్నారని ప్రచారం జరగటానికి కారణం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ నేతలపైనే విజయశాంతి ఆరోపణలు
విజయశాంతి మాత్రం సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు గుప్పిస్తున్నారు. తనపై పుకార్లు సృష్టిస్తుంది గాంధీ భవన్ వర్గాలే అని చెప్తున్నారు. అసలే పార్టీ ని వీడి వెళ్ళే నేతలతో కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికర పరిస్థితులను పార్టీకి క్రియేట్ చేశాయని చెప్పాలి . ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ఏ విషయం చెప్పాలి అనుకున్నా సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు. ఇక తాజా వ్యాఖ్యల నేపధ్యంలో విజయశాంతికి పార్టీలో కొందరు నేతలతో అసలే పడటం లేదని అర్ధం అవుతుంది. ఇటీవల జగ్గా రెడ్డి విషయంలో ఆమె ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications