తమిళనాడుకు వెళ్లను, అంతా ఇక్కడే, ఇదీ కారణం: విజయశాంతి
గత కొంతకాలంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని, ఇక్క ఆ రాష్ట్రంలోనే కీలక నేతగా మారతారని వస్తున్న ఊహాగానాలకు మాజీ ఎంపీ విజయశాంతి తెరదించారు.
హైదరాబాద్: గత కొంతకాలంగా తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారని, ఇక్క ఆ రాష్ట్రంలోనే కీలక నేతగా మారతారని వస్తున్న ఊహాగానాలకు మాజీ ఎంపీ విజయశాంతి తెరదించారు. తన రాజకీయ జీవితమంతా తెలంగాణలోనేనని, తమిళనాడుకు వెళ్లిపోతానన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

అనారోగ్యం వల్లే..
అనారోగ్య కారణంగానే కొంతకాలం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని విజయశాంతి వివరించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకు సాన్నిహిత్యం ఉందని, తానంటే ఆమెకు ఎంతో ఇష్టమని విజయశాంతి తెలిపారు.

జయలలిత అంటే..
జయలలితపై తనకు కూడా అంతే ఇష్టం, గౌరవముందని తెలిపారు. ఆ అభిమానంతోనే సంక్షోభ సమయంలో అన్నాడీఎంకేకు మద్దతు పలికానని విజయశాంతి వివరించారు.

కూలదోయడం సరికాదు
ప్రజలకు ఎంతో సేవ చేసి, మంచి పథకాలు ప్రవేశపెట్టి జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఆమె మరణం తర్వాత సంక్షోభం ఏర్పడినా.. ఆమె ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

శశికళకు మద్దతు
కాగా, విజయశాంతి గత కొంత కాలంగా తమిళ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళకు విజయశాంతి మద్దతు పలికారు. ఆమే సీఎం కావాలని కోరారు. కానీ, ఓ కేసులో దోషిగా తేలిన శశికళ కటకటాల పాలయ్యారు. ఈ క్రమంలోనే విజయశాంతి అన్నాడీఎంకే పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అన్నాడీఎంకేలో కీలక నేతగా ఎదగాలని చూస్తున్నారనే వార్తలూ వచ్చాయి. కానీ విజయశాంతి అవన్నీ అవాస్తవలేనని తేల్చేశారు.












Click it and Unblock the Notifications