పదిసార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్ బండి సంజయ్ మెడలు విరుస్తారా? ఏకిపారేసిన విజయశాంతి
తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి భారతీయ జనతా పార్టీపై, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చేసిన వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సీఎం కేసీఆర్ తీవ్రమైన ఫ్రస్టేషన్లో ఉన్నాడని, హుజురాబాద్ ఉప ఎన్నికలో ఓటమి కెసిఆర్ ఫ్రస్ట్రేషన్ కు కారణమని బిజెపి నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఉందా అని ఎద్దేవా చేసిన కేసీఆర్, కేవలం బిజెపి నాయకులను తిట్టడం కోసమే ప్రెస్ మీట్ పెట్టే స్థాయికి వచ్చారని బిజెపి నేతలు తేల్చి చెబుతున్నారు.

ఈ వింత ప్రచారపు మాటలు హుజురాబాద్ కు వచ్చి ఎందుకు మాట్లాడలేదో.. విజయశాంతి ప్రశ్న
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ బీజేపీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ మెంబర్ విజయశాంతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పది సార్లు మెడలు నరుక్కుంటానని మాట తప్పిన కేసీఆర్ బండి సంజయ్ మెడలు విరుస్తారా? అంటూ ప్రశ్నించినా విజయశాంతి ఈ వింత ప్రచారపు మాటలు హుజురాబాద్ కు వచ్చి ఎందుకు మాట్లాడలేదో అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎన్నో రాష్ట్రాలలో బిజెపి మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని పేర్కొన్న విజయశాంతి, తెలంగాణలో బిజెపి ఎందుకు అధికారంలోకి రాదు అని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు విజయశాంతి.

కేసీఆర్ ప్రెస్ మీట్ కు కారణం అదే
తెలంగాణ రాష్ట్రంలో ముందుగా పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ను తగ్గించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. హుజురాబాద్ ఫలితాల ఎఫెక్ట్... నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ కు కారణమంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు. కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్న కెసిఆర్, పేదల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విజయశాంతి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను ఉద్యమం చేశానని కెసిఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదమని పేర్కొన్న విజయశాంతి, ఒక్క రోజు కూడా సరిగ్గా ఉద్యమంలో కేసీఆర్ పాల్గొనలేదని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సందర్భం కొట్లాటలో కూడా కేసీఆర్ అక్కడ లేరని, అలాంటప్పుడు ఉద్యమకారుడని ఎలా చెప్పుకుంటారు కెసిఆర్ అంటూ ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ లో రైతుల కోసం ఏం చేశారో చెప్పాలి
ఫెడరల్ ఫ్రంట్ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నదంతా డంబాచారమేనని విజయశాంతి విమర్శలు గుప్పించారు. ఇక హుజరాబాద్ ఉపఎన్నిక చిన్న ఎన్నికని, అందులో ఓటమి పాలైతే ఇంత హడావుడి దేనికని సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానం చెప్పిన విజయశాంతి హుజురాబాద్ ఉప ఎన్నిక చిన్న ఎన్నికైతే 500 కోట్ల సొంత డబ్బు, వేల కోట్ల పథకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఎందుకు ప్రయత్నం చేశారని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాత్రమే కాదు అవినీతి ఎవరు చేసిన జైలుకు పోవాల్సిందేనని పేర్కొన్న విజయశాంతి కేసీఆర్ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. రైతుల మీద మీకున్న ప్రేమ ఏపాటిదో, ఢిల్లీలో ఉండి కూడా రైతులకు అండగా నిలబడిన సందర్భమే స్పష్టంగా చెప్పిందని, సీఎం ఢిల్లీ టూర్ ను ఉద్దేశించి విజయశాంతి వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ మెడలు వంచేందుకే బీజేపీ ఉద్యమం
తీవ్ర హిందూ ద్వేషి అయిన ఎంఐఎం పార్టీని మిత్రపక్షమని చెప్పుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, భారతీయ జనతా పార్టీ గొడవలు పెట్టే పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ స్వభావం నిజామీ రజాకార్లకు సలాం చేసేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత సీఎం, దళితులకు 3 ఎకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ హామీల మాదిరిగా దళిత బంధు పేరిట కెసిఆర్ దగా చేస్తారని విజయశాంతి విమర్శించారు. కెసిఆర్ మెడలు వంచి పథకాలను అమలు చేయించడానికి బీజేపీ ఉద్యమం చేస్తోందని విజయశాంతి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications