నిన్న తీర్మానం.. నేడు ఈసీకి: ‘టీఆర్ఎస్ టు బీఆర్ఎస్’ పనులు వేగవంతం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన నేపథ్యంలో తదుపరి కార్యక్రమాలను ప్రారంభించింది. టీఆర్ఎస్ పార్టీ సభ్యుల బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంను కలిసి.. సీఎం,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతకం చేసిన పార్టీ తీర్మానం కాపీనీ అందించింది. పార్టీ పేరు మార్పు(టీఆర్ఎస్-బీఆర్ఎస్)నకు ఆమోదం తెలపాలని టీఆర్ఎస్ బృందం ఈసీని కోరింది.
ఈసీకి బీఆర్ఎస్ తీర్మానం
బుధవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ చేసిన తీర్మానంతో.. ఆ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. టీఆర్ఎస్ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందజేశారు. పేరు మార్పునకు ఆమోదం తెలపాలని ఈ సీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఈసీ ఆమోదం తెలిపితే.. టీఆర్ఎస్ ఇకపై బీఆర్ఎస్
చట్ట ప్రకారం పీపుల్స్ రిప్రజెంటివ్ యాక్ట్ సెక్షన్ 29ఏ(9)లో స్పష్టంగా ఉందని.. ఏ పార్టీ అయిన ఆ పార్టీ పేరును, చిరునామాను మార్చితే వెంటనే ఎన్నికల సంఘంకు తెలియజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చెప్పారు. అందుకే సమయం వృథా చేయకుండా తాము వెంటనే.. బుధవారం తీసుకున్న తీర్మాన పత్రాన్ని గురువారం ఈసీకి అందజేసినట్లు తెలిపారు. మిగితా విషయాలు ఎన్నికల నిబంధనలు అనుసరించి ఉండబోతున్నాయని వినోద్ కుమార్ వెల్లడించారు. కాగా, ఇక ఎన్నికల సంఘం అధికారులు ఆమోదం తెలిపితే.. అధికారికంగా టీఆర్ఎస్.. బీఆర్ఎస్ పార్టీగా మారుతుంది.
ఆయా రాష్ట్రాల్లో కలిసి వచ్చే పార్టీలతో కలిసి బీఆర్ఎస్ పోటీ
విజయదశమి రోజున టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నుంచి టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్గా మారనుందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు. మొదట దక్షిణాదిపై దృష్టిని సారించనున్నట్లు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో మొదట పాగా వేయాలని నిర్దేశించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుని బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి.. బీఆర్ఎస్కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటకలో జేడీఎస్-బీఆర్ఎస్ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. తమిళనాడులో ఓ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైంది.