coronavirus:కుమారుడి నుంచి తండ్రికి, అతని నుంచి 8 మందికి, ఆర్ఎంపీ డాక్టర్కు కూడా..
కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే.. నీడలా వెంటాడుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలిలో కుమారుడి నుంచి తండ్రికి వైరస్ సోకింది. దీంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ తండ్రి, కొడుకు ఎవరినీ కలిశారు, వారి పరిస్థితి ఏంటీ అని ఆరాతీస్తున్నారు.

కుమారుడి నుంచి..
గద్వాల జిల్లా రాజోలికి చెందిన వృద్దుడి కుమారుడు చెన్నైలో కూలీ పనిచేసేవాడు. లాక్ డౌన్ వల్ల పని లేకపోవడంతో.. మార్చి 26వ తేదీన గ్రామానికి వచ్చాడు. అయితే వెంటనే గ్రామస్తులు అలర్టయ్యారు. అధికారులకు సమాచారం అందించడంతో.. అతనిని పరిశీలనలో ఉంచారు. జలుబు, జ్వరం ఉండటంతో భయపడ్డారు. కానీ మూడురోజుల్లోనే తగ్గిపోవడంతోనే వైరస్ లేదు అని నిర్ధారణకు వచ్చారు. కానీ అతని తండ్రికి జ్వరం వచ్చింది.

పాజిటివ్..
ఆర్ఎంపీ వైద్యుని వద్ద చూపించుకున్న ఫలితం లేదు. తగ్గకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో టెస్ట్ చేశారు. టైఫాయిడ్ అని మందులు వాడుతున్నా.. తగ్గలేదు. దీంతో మళ్లీ భయాందోళన మొదలైంది. ఈ సారి ఊహించిందే జరిగింది. ఈ నెల 10వ తేదీన కర్నూలు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. కరోనా లక్షణాలు బయటపడ్డాయి. 16వ తేదీన రక్త నమూనాలు సేకరించగా.. 19వ తేదీన రిపోర్ట్ వచ్చింది. అయితే కరోనా పాజిటివ్ అని రావడంతో వారు ఎవరిని కలిశారు, ఎంతమందికి వైరస్ వ్యాప్తి చెందిందనే ఆందోళన నెలకొంది.

8 మంది క్వారంటైన్
వారు ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరినీ కలిశారు అంశంపై ఆరా తీశారు. ఆదివారం రాత్రి నుంచి 8 మందిని గుర్తించి క్వారంటైన్కు తరలించారు. వీరిలో కుటుంబసభ్యులు, ఆర్ఎంపీ వైద్యుడు కూడా ఉన్నారు. అయితే ఆర్ఎంపీ వైద్యుడు ఎవరెవరిని కలిశారు.. వారి పరిస్థితిపై కూడా ఆరాతీస్తున్నారు. సోమవారం రాజోలిలో ఇంటింటి సర్వే కూడా చేపట్టారు. ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న మరికొందరినీ క్వారంటైన్ తరలిస్తామని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications