నకిలీ వీసా రాకెట్: మహిళా ఎస్ఐ సహా 8 మంది అరెస్టు (పిక్చర్స్)
హైదరాబాద్: అక్రమ పద్ధతిలో గల్ఫ్దేశాలకు మహిళలు, నిరుద్యోగులను పంపుతున్న ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక ఆధారాలతో లోతుగా దర్యాప్తు జరిపి మొత్తం ఎనిమిది మంది ఏజెంట్లతోపాటు ఓ మహిళా ఇమ్మిగ్రేషన్ అధికారి అయిన ఎస్ఐని అరెస్టు చేశారు.
హైదరాబాద్లో ఇమ్మిగ్రేషన్ మహిళా అధికారి పట్టుబడటం ఇదే తొలిసారి కావడం శంషాబాద్ విమానాశ్రయ అధికారుల్లో కలకలం రేపింది. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలు మీడియాకు వివరించారు.
నిందితుల్లో తెతల్లి సుబ్బిరెడ్డి, యెడ్డుల శంకర్, తోట కాంతేశ్వర మణికంఠ, ఎం డేవిడ్రాజు, జక్కంశెట్టి వెంకటేశ్వరరావు, సయ్యద్ ఇలియాజ్, సబ్జర్ హూసేన్లతోపాటు ఇమ్మిగ్రేషన్ విభాగం ఎస్ఐ డిబోరా డోమ్మరా ఉన్నారు.
లంచాలు ఇచ్చి...
ఏజెంట్లు, ఎయిర్లైన్స్ కంపెనీ ఉద్యోగులు, ఇమ్మిగ్రేషన్ అధికారులకు లంచాలు ఇచ్చి ప్రయాణికులను నకిలీపత్రాలతో పంపిస్తున్నట్లు శంషాబాద్ పోలీసులు నిర్ధారించి ఎనిమిది మందిని అరెస్టు చేశారు.
వారూ నిందితులే..
తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కూడా నిందితులేనని డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ స్పష్టంచేశారు.
నాలుగు వేల మందిని పంపించారు..
నాలుగు వేల మందికి పైగా ప్రజలను కొద్ది నెలల్లోనే గల్ఫ్ దేశాలకు పంపించనట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. తప్పుడు పత్రాలతో వెళ్లిన 200 మందిని 2015లో వెనక్కి పంపించారు.
ఈ జిల్లాల్లో పనిచేస్తున్నాయి..
నకిలీ వీసా ముఠా తూర్పో గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, నిజామాబాద్ జిల్లాల్లో పనిచేస్తున్నట్లు, ఒక్కో ఏజెంట్ వద్ద 40 మంది సబ్ ఏజెంట్లు పనిచేస్తున్నారని శంషాబాద్ డిసిపి ఎఆర్ శ్రీనివాస్ చెప్పారు.