వివేక్ కు రాహుల్ గాంధీ బిగ్ టాస్క్ - ఆ ఫోన్ కాల్ తో..!!
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేశారు. రాహుల్ సమక్షంలో వివేక్.. తన కొడుకు వంశీతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. గాంధీ కుటుంబంతో వెంకటస్వామి ఫ్యామిలీకి సుదీర్ఘ అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఇదే సమయంలో వివేక్ కు ఎన్నికల వేళ కీలక టాస్క్ అప్పగించినట్లు తెలుస్తోంది. పోటీ పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తనకు సీటు ముఖ్యం కాదని..బీఆర్ఎస్ ను కలిసి కట్టుగా ఎదుర్కొంటామని వివేక్ స్పష్టం చేసారు.
కాంగ్రెస్ లోకి వివేక్: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. బుధవారం రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు. తనకు టిక్కెట్ ముఖ్యం కాదు.. కేసీఆర్ సర్కారుపై పోరాడటమే ముఖ్యం అన్నారు. కేసీఆర్ ను గద్దె దించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

కాంగ్రెస్ తో వివేక్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తమ ఆహ్వానం మేరకు ఆయన కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. కీలకమైన సమయంలో కాంగ్రెస్ లోకి వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలనే వివేక్ కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. వివేక్ కు రాహుల్ గాంధీ ఫోన్ లో మాట్లాడారు. ఆ వెంటనే పార్టీ మార్పు పై వివేక్ నిర్ణయం తీసుకున్నారు.
చెన్నూరు సీటుపై హామీ: కీలక సందర్భంలో వివేక్ కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు. కాంగ్రెస్ కావాలి.. కాంగ్రెస్ రావాలి అనే ప్రజల ఆకాంక్షకు వివేక్ చేరిక బలాన్నిస్తుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్లో మాట్లాడి కాంగ్రెస్లో చేరాలని కోరారని, ఆయన కోరిక మేరకు ఇవాళ రాహుల్ సమక్షంలో పార్టీలో చేరారన్నారు.
వివేక్ తిరిగి కాంగ్రెస్ లో చేరడమంటే ఆయన సొంత కుటుంబంలో చేరినట్లేనని, ఆయన్ను కాంగ్రెస్లోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని రేవంత్ అన్నారు. వివేక్ చేరిక కాంగ్రెస్కు వెయ్యేనుగుల బలాన్ని చేకూర్చిందన్నారు. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ వివేక్తో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వివేక్ లాంటి వాళ్లు కాంగ్రెస్లోకి రావటం శుభసూచికంగా పేర్కొన్నారు.
రాహుల్ తో మంతనాలు: ఇక, సీటు ఖరారు పైనా వివేక్ తో పార్టీ నేతలు చర్చలు చేసినట్లు సమాచారం. వివేక్ పార్లమెంట్ కు పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కుమారుడు వంశీకి చెన్నూరు సీటు ఇచ్చే అంశం పైన చర్చ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీపీఐ తో పొత్తుల్లో భాగంగా చెన్నూరు సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ముందుకు వచ్చింది.
అయితే, ఇప్పుడు వివేక్ చేరికతో సీపీఐకి ఇవ్వాల్సిన సీటు మార్పు పైన ప్రతిపాదన చేసినట్లు చెబుతున్నారు. దీని పైన కాంగ్రెస్ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ తుది జాబితా లో చెన్నూరు సీటు ప్రకటిస్తారని తెలుస్తోంది. దీంతో, వివేక్ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషిస్తారనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications