క్యాంపుల నుంచి పోలింగ్ కేంద్రాలకు- ప్రారంభమైన ఓటింగ్ : ఆ రెండు సీట్లపై ఆసక్తి...!!
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థి మాజీ మేయర్ రవీందర్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ జిల్లాలో.. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుర్రి శ్రీనివాస్రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మొత్తం ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
కరీంనగర్ లో రెండు స్థానాలకు పోటీ
ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నిక జరుగుతుండగా... కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన రెండు స్థానాలకు ఎన్నిక జరుగనుంది. ఎన్నికల కోసం అధికారులు 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నేడు ఎన్నికలు జరుగుతున్న ఆరు స్థానాల్లోనూ గెలుపొందేలా సుమారు వారం రోజులుగా టీఆర్ఎస్ ఓటర్లతో క్యాంపులు ఏర్పాటు చేసింది.
క్యాంపుల నుంచి వచ్చిన ఓటర్లు
బెంగళూరు, మైసూరు, ఢిల్లీ, ఆగ్రా, జైపూర్, కాశ్మీర్, గోవా తదితర ప్రాంతాల్లో సుమారు వారం రోజులుగా పర్యటించిన కరీంనగర్, మెదక్, ఖమ్మం ఓటర్లు బుధ, గురువారాల్లో బృందాల వారీగా హైదరాబాద్కు చేరుకున్నారు. నల్లగొండ, ఆదిలాబాద్ ఓటర్లు భద్రాచలం, కాళేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించుకుని బుధవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. వారంతా ఇప్పుడు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తొలిసారిగా ఎమ్మెల్యేలు..ఎంపీలకు ఓటు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇందులో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Recommended Video
రెండు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ
మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. ఇక, కరీంనగర్ లో ఎన్నిక పైన ఆసక్తి నెలకొని ఉంది. అక్కడ రెండు స్థానాల్లో పది మంది అభ్యర్దులు బరిలో ఉన్నారు. ఇక, ఓటర్లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్లో పాల్గొనాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ విజ్ఞప్తి చేశారు. సిబ్బందితో పాటు ఓటర్లు గ్లౌజ్లు, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని, అభ్యర్థులు తమ ప్రతినిధులను కూడా స్ట్రాంగ్ రూమ్ వద్ద కాపలా పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నామని తెలి పారు. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.