చిక్కులు తేవద్దు, ఆరోగ్యం బాలేదు, మరికొద్ది రోజులు: రాజమండ్రిలో సండ్ర
రాజమండ్రి: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీపీ నోటీసులు ఇచ్చిన ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శనివారం నాడు రాజమండ్రిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రి అతిథి గృహంలో ఉన్నట్లుగా ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి.
ఓ ఆంగ్ల పత్రికకు చెందిన విలేకరి, సండ్రను అడగగా.. తనను వివాదంలోకి లాగవద్దని, చిక్కుల్లో పడేయవద్దని కోరారని తెలుస్తోంది. తాను మరికొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉండాలని వ్యాఖ్యానించాడని తెలుస్తోంది.
ఓటుకు నోటు కేసులో సండ్రకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఆయన తన ఆరోగ్యం బాగా లేదని, ప్రస్తుతానికి తాను విచారణకు హాజరు కాలేనని, పది రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పారని ఏసీబీకి లేఖ రాశారు.
సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం నాడు విశాఖపట్నంలో కనిపించారని, ఆ తర్వాత కాకినాడ మీదుగా రాజమండ్రి వచ్చారని, స్థానిక ప్రయివేటు ఆసుపత్రి బొల్లినేని ఆసుపత్రిలోని 306 రూం నెంబరులో అడ్మిట్ అయ్యారని చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, సదరు రిపోర్టర్ సండ్రను ఆసుపత్రిలోని టాప్ ఫ్లోర్ అతిథి గృహంలో చూశారని తెలుస్తోంది. వేం నరేందర్ రెడ్డిని ప్రశ్నించాక ఆయన ఏసీబీ ఎదుట విచారణకు హాజరు కానున్నారని తెలుస్తోంది.
గత రెండు వారాలుగా తన తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని చెప్పారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆయన దేని గురించి సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. కాగా, బొల్లినేని ఆసుపత్రి మాజీ ఎమ్మెల్యే కృష్ణయ్యకు చెందినదిగా భావిస్తున్నారు.