ఇతర ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయాలనుకుంటున్నారా..? ఐతే జాగ్రత్త సుమీ..!!
Recommended Video
హైదరాబాద్: మీ బ్యాంక్ ఏటీఎం కు కాకుండా ఇతర బ్యాంక్ ఏటీఎంకి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్నారా..? ఐతే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ.. ఇతర ఏటీఎంలో డెబిట్ కార్డుతో డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు డబ్బులు కట్ ఐనట్టు మెస్సేజ్ మాత్రమే వస్తుంది తప్ప డబ్బులు మాత్రం రావు. దీంతో ఖాతాదారులు అయోమయానికి గురౌతున్నారు. ఏటీఎం సెంటర్లతో నగదు రాకుండా మొబైల్ ఫోన్ కి సందేశాలు రావడం.. బ్యాంకు ఖాతాలో నగదు మాయమవడం గురించి బ్యాంకుల్లో ఆరా తీస్తే అక్కడి అధికారులు ఏ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా ఎక్కడ ఉందో ఆ శాఖ నుంచి ఫిర్యాదు చేస్తే సమస్య గురించి పరిశీలిస్తామని సదరు ఏటీఎంలకు చెందిన బ్యాంకు అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. సొంత బ్యాంక్ శాఖకు వెళ్లి అడిగితే ఎక్కడైతే డబ్బు పోయిందో అక్కడ మొదట ఫిర్యాదు చేయాలని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
బీజేపీకి ఫేవర్ చేసిన జగన్ .. జగన్ ఆ నిర్ణయమే బీజేపీకి జోష్ తెచ్చింది
సొంత బ్యాంకు ఏటీఎంలు దొరకవు...! లూటీ చేస్తున్న ఇతర ఏటీఎంలు..!!
ఏటీఎంలో ఉన్న మొత్తం డబ్బును డ్రా చేస్తే వారి పరిస్థితి ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర సమయంలో సేవలు అందించడానికే ఇతర బ్యాంకుల్లోనూ నగదు తీసుకునే వెసులుబాటు కల్పించినప్పటికీ ఇటువంటి సంఘటనలతో బ్యాంకు సేవల మీద నమ్మకం సన్నగిల్లుతోందని, అత్యవసర సమయంలో సొంత బ్యాంకు ఏటీఎంల కోసం నగరంలో వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. ఆసుపత్రుల్లో వైద్యం కోసమో ఇతర అత్యవసరాలకో డబ్బు డ్రా చేసిన తర్వాత ఇలా జరిగితే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని చెబుతున్నారు. వ్యాపారుల బాధలు చెప్పనక్కర్లేదు. ఏటీఎంలను నమ్ముకోకుండా క్యూలైన్లో నిల్చొని చెక్కుల ద్వారా నగదు తీసుకోవడమే క్షేమమని సాంకేతిక లోపాలు ఖాతాదారులకు శాపాలుగా పరిణమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డబ్బులు రావు..! డబ్బులు కట్ ఐనట్టు సందేశం మాత్రం వస్తుంది..!!
సికింద్రాబాద్లో ఉంటున్న ఓ వ్యక్తికి అత్యవసరంగా 10వేల రాపాయలు అవసరమయ్యాయి. దగ్గర్లో తన ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎంలు ఎక్కడా కనిపించలేదు. మూడు లావాదేవీలు ఉచితమే కదా అని ఇతర బ్యాంకు ఏటీఎంలోకి వెళ్లి తన వివరాలను నమోదు చేసి తనకు కావాల్సిన మొత్తాన్ని అందులో టైప్ చేశాడు ఆ వ్యక్తి. లావాదేవీ పూర్తయిందని ఏటీఎం నుంచి సందేశం ప్రత్యక్షమవుతూనే తన మొబైల్ ఫోన్ కు డబ్బులు డెబిట్ అయినట్లు ఎస్సెమ్మెస్ వచ్చింది. తీరా చూస్తే ఏటీఎం నుంచి ఒక్క నయాపైసా చేతికి అందలేదు. దీంతో ఖాతాదారుడు లబోదిబోమనడమే తరువాయిగా మారింది.
డెబిట్ అయినట్లు ఎస్సెమ్మెస్ లు..! నగరంలోని కొన్ని ఏటీఎంలలో దుస్థితి..!!
బేగంపేటలో వ్యాపారం చేస్తున్న మరో ఖాతాదారుడు ఓ బ్యాంకులో కరెంట్ ఖాతాను నిర్వహిస్తున్నాడు. వారంలో మూడు రోజులు నగదు లావాదేవీలతోనే సమయం సరిపోతుంది. ఇటీవలే ఓ లావాదేవీ నిమిత్తం బేగంపేటలోని ఇతర బ్యాంకు ఏటీఎంలో పెద్ద మొత్తంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లాడు. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మొబైల్ ఫోన్ కి డబ్బు డెబిట్ అయినట్లు సందేశం వచ్చింది కానీ ఏటీఎం నుంచి ఎలాంటి డబ్బు చేతికందలేదు. అత్యవసరంగా డబ్బు ఇతరులకు ఇవ్వాల్సి ఉండగా ఇలా జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతరుల వద్ద అప్పు చేసి ఇవ్వాల్సి వచ్చిందని వాపోయాడు.
డబ్బులు పోయిన తర్వాత చేసేది ఏం లేదు..! పట్టించుకోని బ్యాంక్ అదికారులు..!!
ఇలా డబ్బులు పోవడానికి రెండు రకాల కారణాలుంటాయి. ఒకటి ఏటీఎంలో స్ట్రక్ అవ్వడం (ఇరుక్కుపోవడం), రెండోది డబ్బులు లేకపోవడమో, సాంకేతిక, ఇతర కారణాల ద్వారా డబ్బులు పూర్తిగా రాకపోవడం. ఇలాంటి సందర్భాల్లో ముందుగా నగదు రాకుండానే సందేశం వచ్చిందని ఖాతా ఉన్న బ్యాంకులో లేదా వినియోగదారుల ఫిర్యాదు కేంద్రాన్ని సంప్రదించాలి. ఏ సమయంలో, ఏ ప్రాంతంలో డబ్బు పోయిందో వివరించాలి. ట్రాన్సాక్షన్ సంఖ్య తదితర వివరాలను అందించాలి. దీంతో విచారణ బృందం నగదు ఎలా రాలేదు అన్న విషయంపై దర్యాప్తు జరుపుతారు. ఇరుక్కుపోయిందని తెలిస్తే వెంటనే సొంత బ్యాంకు అయితే ఐదు రోజుల్లో, ఇతర బ్యాంకు అయితే ఏడు రోజుల్లో సమస్య పరిష్కారమై నగదు తిరిగి వచ్చేస్తుంది. రెండో కారణం అయితే వినియోగదారుడు వెంటనే ఫ్రాడ్ ఫిర్యాదును బ్యాంకులో అందించాలి. సమస్య ఎలా, ఎందుకు తలెత్తిందన్న విషయంపై బ్యాంకు అధికారులు కూలంకషంగా, సమగ్రంగా విచారణ జరపుతారు. ఇందుకోసం రెండు నెలల సమయం పడుతుంది.