తండ్రి మందలించాడని, యువకుడి బండిపై ప్రయాణించి..: వారిది ఆత్మహత్యే
వరంగల్: చెన్నారావుపేట మండలం ఖాదర్పేట గుట్టలో మృతి చెందిన ఇద్దరు విద్యార్థినులది ఆత్మహత్యేనని ఏఎస్పీ జాన్ వెస్లీ ఆదివారం వెల్లడించారు. నల్లబెల్లి ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతునన విద్యార్థినులు భూమిక, ప్రియాంకలు తండ్రి మందలించాడనే కారణంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు.
వరంగల్ జిల్లా నర్సంపేటలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పర్వతగిరి మండలం కంబాలకుంట తండాకు చెందిన భూమిక, ప్రియాంకలు గత ఏడాది నవంబర్ 23న ఫొటో దిగి హాస్టల్కు బయలు దేరారు. నర్సంపేటలో మ్యాట్నీ సినిమా చూశారు.
అనంతరం శ్రీనగర్లోని తన అక్క ఇంటికి వెళ్లి ఆ రాత్రి అక్కడే ఉన్నారు. సమాచారం తెలుసుకున్న భూమిక తండ్రి పాఠశాలకు ఎందుకు వెళ్లలేదని ఫోన్ చేసి మందలించారు.
దీంతో భూమిక మనస్తాపానికి గురై ప్రియాంకతో కలిసి నవంబర్ 24న మల్లంపల్లిలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణంలోపురుగుల మందు, కూల్ డ్రింక్ బాటిల్ను కొనుక్కొని నర్సంపేటకు వచ్చి జయముఖి కాలేజీ వరకు వెళ్లారు. అక్కడి నుంచి ఓ యువకుడి టీవీఎస్ పైన చెన్నారావుపేట బ్యాంకు వరకు వెళ్లినట్లుగా సమాచారం.
అక్కడి నుంచి ఖాదర్పేట గుట్టలకు వెళ్లిన భూమిక, ప్రియాంక పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. విచారణ కొనసాగుతోందన్నారు.
దర్యాప్తు వేగవంతం చేయాలి: విద్యావంతుల వేదిక
గిరిజన బాలికల మృతి సంఘటనపై దర్యాప్తును వేగవంతం చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జగదీశ్వర్ ఆదివారం అన్నారు. ఇద్దరు బాలికల మృతిపై నిజనిర్థారణ జరిపినట్లు తెలిపారు. వ్యవస్థలోని అన్నిరకాల లోపాలే ఆ ఇద్దరి మృతికి కారణమన్నారు.
ఆశ్రమ పాఠశాల సిబ్బంది బాధ్యతారాహిత్యంతో విద్యార్థినుల్లో క్రమశిక్షణ లోపించిందన్నారు. బాలికల ఆశ్రమ పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులను, సీఆర్టీలుగా మహిళను నియమించాల్సి ఉండగా అందుకు భిన్నంగా పురుష ఉపాధ్యాయులను నియమించడం శోచనీయమన్నారు.
ఒకవేళ పురుషులను నియమించాల్సి వస్తే 50 ఏళ్లకు పైబడిన వారిని నియమించాలనే నిబంధనలను ఉల్లంఘించడం దారుణమన్నారు. వంట మనిషి రాజమ్మ ఫోన్ ఇవ్వడం, అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించక పోవడంతో విద్యార్థులు విగతజీవులుగా మారిన సంఘటనపై ప్రజల్లో అనేక సందేహాలున్నాయని వెంటనే దర్యాప్తు వేగవంతం చేసి దాని వెనుక ఉన్న వాస్తవాలేమిటో వెల్లడించాలన్నారు.
విద్యార్థినులు భూమిక, ప్రియాంకల మృతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు జీవన్ కుమార్ డిమాండ్ చేశారు. ములుగులో విలేకరులతో మాట్లాడారు. కేసు విచారణకు సంబంధించి పోలీసుల స్పందన సరిగా లేదని, తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.
ఈ కేసులో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉందని ఆనుమానం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదిక కూడా ఇంకా అందలేదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానితులుగా పేర్కొంటున్న వీరమ్మ, రాజమ్మ, వినోద్లను పాఠశాల నుంచి బదిలీ చేశారే తప్ప విచారణ, ఇతర చర్యలు చేపట్టలేదన్నారు. గిరిజన మంత్రిగా చందూలాల్, ఉప ముఖ్యమంతిగా కడియం శ్రీహరి ఉన్నా స్పందించడం లేదన్నారు.