వరంగల్ ఉప ఎన్నిక: జగన్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశ్, కెసిఆర్ కోసమేనా?
హైదరాబాద్: వరంగల్ లోకసభ ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ప్రకటించింది. నల్లా సూర్యప్రకాశ్ను తమ అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు తెలంగాణ వైసిపి అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో పొంగులేటి మాట్లాడారు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే తాము ప్రచారాస్త్రాలుగా వాడుకుంటామన్నారు.
సూర్య ప్రకాశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ఓటర్లను కోరారు. తమ పార్టీ పైన కొందరు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదమన్నారు. వాటిని ప్రజలు నమ్మరని తెలిపారు.
కాగా, తెలంగాణలో బలం లేని వైసిపి వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీపై టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. విపక్ష ఓట్లను చీల్చేందుకు తద్వారా టీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకే బరిలోకి దిగుతున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వార్డుల విభజనపై గవర్నర్కు ఫిర్యాదు
గ్రేటర్ హైదరాబాదులో వార్డుల విభజనలో ప్రభుత్వం మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గిందని బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ వేరుగా ఆరోపించారు. ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సంక్రాంతి సెలవుల్లో గ్రేటర్ ఎన్నికలు నిర్వహించాలని కుట్ర చేస్తోందన్నారు.
బీజేపీ నేతలు లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, పలువురు బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. గ్రేటర్ పరిధిలో ఓట్ల తొలగింపు, వార్డుల విభజనపై ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా వార్డులను విభజించారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.