మీకు ఓటడిగే హక్కెక్కడిది? వరంగల్ గడ్డ కాంగ్రెస్ అడ్డా: నాయిని రాజేందర్ రెడ్డి!!
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల పోరు హోరాహోరీగా కొనసాగుతుంది. పశ్చిమ నియోజకవర్గంలో త్రిముఖ పోరు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎంతో కాలంగా జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూ కీలకంగా వ్యవహరించిన నేతలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో పోటీ పడుతున్న క్రమంలో రాజకీయం రసవత్తరంగా మారింది.
Recommended Video

వరంగల్ కాంగ్రెస్ పార్టీ నుండి నాయిని రాజేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ నుండి దాస్యం వినయ్ భాస్కర్, బిజెపి నుండి పద్మా రెడ్డి హోరాహోరీగా ఎన్నికల పోరులో తలపడుతున్నారు. అయితే ప్రచారంలో తమదైన దూకుడును కొనసాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి వన్ఇండియా ప్రతినిధితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఓట్లు అడిగే హక్కు వినయ్ భాస్కర్ కు లేదని ఆయన తేల్చి చెప్పారు. వర్షాలు, వరదలతో వరంగల్ అతలాకుతలమైనా పట్టించుకున్న దాఖలాలు లేవని, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే ధోరణి నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండేదని నాయిని రాజేందర్ రెడ్డి విమర్శించారు.
ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తామని తెలిపారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డాగా మారిందని, అభివృద్ధి శూన్యంగా మారిందని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రజలకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని దుయ్యబట్టారు. అభివృద్ధి చేశాము, సంక్షేమం అందించామని చెప్పడానికి బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఎందుకు లేదో చెప్పాలని ప్రశ్నించారు.
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిజెపి అడ్రస్ ఉండదని, బీఆర్ఎస్ నేతలు చేసిన దాడులు, దౌర్జన్యాల పైన ప్రజలు విరక్తి చెంది ఉన్నారని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి తీరుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లో వార్ వన్ సైడేనని నాయిని రాజేందర్ రెడ్డి తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications