ప్రణయ్, అమృత విషాదంత ప్రేమకథను ప్రపంచం చదువుతోంది: వాషింగ్టన్ పోస్ట్ లో ప్రత్యేక కథనం
నల్లగొండ: ప్రణయ్, అమృత విషాదంత ప్రేమకథ రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు.. మొత్తం ప్రపంచాన్నే కదిలిస్తోంది. తెలంగాణలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గత ఏడాది చోటు చేసుకున్న దారుణ హత్యోదంతాన్ని ప్రస్తుతం ప్రపంచం మొత్తం చదువుతోంది. ఎక్కడ మిర్యాల గూడ.. ఎక్కడ వాషింగ్టన్.. ప్రణయ్ హత్యోదంతానికి సంబంధించిన కథనం ఈ రెండింటి మధ్య ముడి వేసింది. అగ్రరాజ్యం అమెరికా రాజధాని వాషింగ్టన్ ప్రధాన కేంద్రంగా వెలువడే వాషింగ్టన్ పోస్ట్ దినపత్రిక.. ప్రణయ్ హత్యోదంతంపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక వెబ్ సైట్ లోనూ దీన్ని పొందుపరిచింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ కథనాన్ని వెబ్ సైట్ లో పొందుపరిచారు.

ఎన్నో పరువు హత్యలు చోటు చేసుకున్నా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మనదేశంలో అనేక పరువు హత్యలు చోటు చేసుకున్నాయి. పరువు కోసం తమ కన్నబిడ్డలను బలి తీసుకున్న సందర్భాలు, సంఘటనలు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ- అవేవీ పెద్దగా ప్రపంచం దృష్టిని ఆకట్టుకోలేకపోవచ్చు. ప్రణయ్, అమృత వర్షిణిల విషాదంత ప్రేమకథ ఒక్కటే వాషింగ్టన్ పోస్ట్ యాజమాన్యాన్ని ఆలోచింపజేసింది. `A young Indian couple married for love. Then the bride's father hired assassins..` అనే హెడ్ లైన్ తో ఈ వార్త వాషింగ్టన్ డీసీ వెబ్ సైట్ లో ద్వారా ప్రపంచానికి అందించారు. ప్రణయ్, అమృత వర్షిణ ప్రేమ ఎలా మొదలైందనే అంశంతో పాటు.. హత్యకు దారి తీసిన కారణాలు, నాటి పరిస్థితులను ఉటంకిస్తూ ఈ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.
హత్యకు దారి తీసిన కారణాలపై సమగ్ర కథనం..
ప్రణయ్ పదో తరగతి, అమృత తొమ్మిదో తరగతి చదువుతున్నప్పటి నుంచే స్నేహితులు. తర్వాత అది ప్రేమగా మారింది. ఇద్దరూ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. పెళ్లి చేసుకుంటామని ఇరువురి కుటుంబ సభ్యులను అడిగితే, అమ్మాయి తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. దాంతో వారు ఈ ఏడాది జనవరి 31న హైదరాబాద్ వెళ్లి ఆర్యసమాజ్లో వివాహం చేసుకున్నట్లు వాషింగ్టన్ పోస్ట్.. తన కథనంలో పేర్కొంది. గత ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన మిర్యాలగూడలో పట్టపగలు, నడిరోడ్డు మీద ప్రణయ్ దారుణ హత్యకు గురైన ఉదంతాన్ని ఇప్పట్లో ఎవరూ పెద్దగా విస్మరించలేకపోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి తెలియని వారు సైతం ఉండకపోవచ్చని అంచనా వేసింది.

హత్య వీడియో..
పెరుమాళ్ల ప్రణయ్, గర్భంతో ఉన్న తన భార్య అమృత వర్షిణిని ఆసుపత్రికి తీసుకెళ్లి, తిరిగి వస్తుండగా.. ఆసుపత్రి సమీపంలోనే దారుణ హత్యకు గురయ్యారు. తన మాట వినకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమృత తండ్రి టీ మారుతిరావు కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించాడు. ఈ కేసులో మారుతీరావును ఏ1గా, ఆయన సోదరుడు శ్రవణ్ను ఏ2గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. కొన్నాళ్ల పాటు జైలులో శిక్షను అనుభవించిన మారుతి రావు.. ప్రస్తుతం బెయిల్ పై విడుదలయ్యారని వెల్లడించింది. దీనికి సంబంధించి.. ఆసుప్రతి వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను వాషింగ్టన్ పోస్ట్.. తన కథనంలో పొందుపరిచింది.

దళిత సంఘాల స్పందనపై..
ప్రణయ్, అమృత వివాహం చేసుకున్న తేదీ, దళిత సంఘాల ప్రతినిధులు స్పందించిన తీరు, ఈ కేసును వాదించిన న్యాయవాదిని సైతం ఈ కథనంలో ప్రస్తావించారు. ప్రణయ్ హత్య అనంతరం అమృత జీవన స్థితిగతులు, కుమారుడు జన్మించడం, అమృత తండ్రి మారుతి రావు నైజాన్ని స్పృశించారు ఈ కథనంలో. దళిత మానవ హక్కుల జాతీయ ఉద్యమ సంఘం ప్రధాన కార్యదర్శి పాల్ దివాకర్, ఈ కేసును వాదించిన న్యాయవాది చిలుకూరి శ్యామ్ సుందర్, ప్రణయ్ తండ్రి బాలాస్వామి పేర్లను ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. ఆధునిక కాలంలోనూ దళితుల అణచివేత కొనసాగుతోందని పాల్ దివాకర్ మాటలను ఈ కథనంలో ఉటంకించారు. ప్రస్తుతం అమృత వర్షిణి తన భర్త ఇంట్లోనే నివసిస్తున్నారని, మామ బాలస్వామి సంరక్షణలో జీవనాన్ని గడుపుతున్నారని పేర్కొంటూ సమగ్ర కథనాన్ని అందించింది.












Click it and Unblock the Notifications