వారంతా బాధితులే, ఇబ్బంది పెట్టం: డ్రగ్-సినీ స్టార్స్పై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: డ్రగ్ వ్యవహారంలో తాము సినీ రంగాన్ని టార్గెట్ చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం స్పష్టం చేశారు. ఆయన డ్రగ్ కేసుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రవితేజ చుట్టు ఉచ్చు?: డ్రగ్ ముఠాతో పరిచయం ఎలా.. విస్తుపోయే అంశాలు?
డ్రగ్ వాడుతున్న వారి వివరాలను, దందా చేస్తున్న వారి వివరాలు తెలిశాయన్నారు. డ్రగ్ విచారణ కేసులో సినీ రంగానికి చెందిన వారు డ్రగ్ వాడుతున్నట్లుగా తేలిందని చెప్పారు. డ్రగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు.
సినీ ప్రముఖులున్నా కేసులు
సినీ రంగానికి చెందిన 12 మందితో కలిపి మరో 27 మందిని విచారించామని, విచారిస్తున్నామని తెలిపారు. అమ్మకందారులు, కొనుగోలుదారుల్లో సినీ ప్రముఖులు ఉంటే వారి పైన కేసులు పెడతామని కేసీఆర్ హెచ్చరించారు.
డ్రగ్ వాడకం నేరం కాదు, వారు బాధితులే
డ్రగ్స్ వాడటం నేరం కాదని, వ్యాపారం చేయడం మాత్రం నేరమని కేసీఆర్ చెప్పారు. నేరస్తులను శిక్షిస్తామని, బాధితులను ఇబ్బంది పెట్టమని చెప్పారు. డ్రగ్ సరఫరా చేసేవారు, అమ్మేవారు.. ఇలా ఎవరినీ క్షమించేది లేదని చెప్పారు. డ్రగ్స్ వాడేవారు తమ అలవాటును మార్చుకోవాలని హితవు పలికారు.
తెలంగాణలో డ్రగ్ వాడకం తక్కువ
తెలంగాణలో డ్రగ్ వాడకం చాలా తక్కువగా ఉందని కేసీఆర్ చెప్పారు. అయితే, డ్రగ్ ప్రవేశమే లేకుండా చేయాలన్నది తమ ప్రయత్నమని చెప్పారు. ఇందులో భాగంగా విచారణ జరుగుతోందన్నారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేశామనే వాదనలో వాస్తవం లేదన్నారు.
కీలకసూత్రధారుల్ని గుర్తించాం
ఏ రంగానికి చెందినవారైనా వాడకందారులను బాధితులుగానే పరిగణిస్తున్నామని కేసీఆర్ చెప్పారు. డ్రగ్ కేసులో కీలక సూత్రధారులను గుర్తించామని చెప్పారు. మొగ్గలోనే తుంచివేసేందుకు డ్రగ్ కేసులో లోతైన విచారణ అన్నారు. డ్రగ్స్, గుడుంబాపై కీలక సమాచారం ఇస్తే రూ.1 లక్ష బహుమతి ఇస్తామన్నారు.