చంద్రబాబును పిలవాలనే అనుకున్నాం.. కానీ, ఎన్టీఆర్ విషయం వేరు: నందిని సిధారెడ్డి
తాము నిర్వహించింది ప్రపంచ తెలుగు మహాసభలని, తెలంగాణ మహాసభలు కాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: తాము నిర్వహించింది ప్రపంచ తెలుగు మహాసభలని, తెలంగాణ మహాసభలు కాదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి స్పష్టం చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
భాగ్యనగరంలో నిర్వహించింది ప్రపంచ తెలుగు మహాసభలే అయినప్పటికీ, తెలంగాణ ఘనతను, వైభవాన్ని ప్రపంచ తెలుగు ప్రజలందరి ముందర చాటి చెప్పేందుకు ఏర్పాటు చేసిన సభలు ఇవని చెప్పారు.
తెలుగువారందరినీ ఆహ్వానించాలంటే...
భాగ్యనగరంలో ఇటీవల ఐదురోజులపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలకు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ ఆహ్వానించాలంటే ఒక సంవత్సర కాలమైనా చాలదని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి వ్యాఖ్యానించారు. ఎవరిని ఆహ్వానించాలి, ఏం చెప్పాలి, ఎలా నిర్వహించాలనే వాటిపై తమకు ఉన్న స్పష్టతతో, ఒక సంకల్పంతో ఈ మహాసభలను నిర్వహించి విజయం సాధించామని, ఈ మహాసభల ద్వారా వంద శాతం లక్ష్యాన్నిఅందుకున్నామని ఆయన చెప్పారు.
మాకు కొన్ని లక్ష్యాలున్నాయి...
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో తమకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయని నందిని సిధారెడ్డి తెలిపారు. తెలంగాణ భాష, సాహిత్యం, సంస్కృతి వికాసాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనేది తమ మొదటి లక్ష్యమన్నారు. తెలంగాణలోని మహనీయులు, గొప్ప కవులను గుర్తుచేసుకుని, వాళ్ల కృషిని జ్ఞాపకం చేసుకోవడమనేది రెండోది లక్ష్యమని, ఇక ఇప్పటి తరం ఆంగ్ల మాధ్యమం వలయంలో చిక్కుకుని సతమతమవుతోందని, ఆ మాధ్యమంలో చిక్కుకున్నటు వంటి కొత్త తరాన్ని తెలుగు భాష వైపు మళ్లించాలనేది తమ మూడో లక్ష్యం అని చెప్పుకొచ్చారాయన.
సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమని...
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు లేకుండా నిర్వహించిన మహాసభలకు ‘ప్రపంచ తెలుగు మహాసభలు' అని కాకుండా ‘తెలంగాణ మహాసభలు' అని పేరు పెడితే బాగుండేది అనే ప్రశ్నకు నందిని సిధారెడ్డి తన దైన శైలిలో స్పందించారు. ‘చంద్రబాబునాయుడు ఒక్కడే ప్రతినిధా? రాజకీయాలకు చెందిన వ్యక్తుల కంటే సాహిత్యానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమని మేం అనుకున్నాం. భాషను బతికించడంలో రచయితలు, కవులు, సాహిత్యం కీలకం..' అని చెప్పారు. భాషకు నిజంగా ఎవరు సేవ చేస్తున్నారో వాళ్లంతా వచ్చారు. పాలకులు రాకపోవచ్చు. పాలకులకు రాజకీయాలు ఉంటాయి. అసలు ముఖ్యమంత్రులను పిలిచే సంప్రదాయం లేదు. అయితే, తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగాయి కనుక ఇక్కడి ముఖ్యమంత్రి పాల్గొన్నారు..' అని సిధారెడ్డి చెప్పారు.
చంద్రబాబను పిలవాలనే అనుకున్నాం...
ప్రపంచ తెలుగు మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబును పిలవలేదనడం తప్పని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి తెలిపారు. ‘చంద్రబాబునాయుడుని ఆహ్వానించాలనే అనుకున్నాం. అయితే ఆయన హాజరయ్యేందుకు తేదీలు కుదర్లేదు. చంద్రబాబు కోసం ప్రపంచ తెలుగు మహాసభల తేదీలు మార్చడం కుదరదుగా? అందుకే ఆయన లేకుండానే ఈ సభలు జరిగాయి అని చెప్పారు. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాలు పూర్తయితే తప్ప.. ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం పూర్తిగా రాదు..' అని సిధారెడ్డి అభిప్రాయపడ్డారు.
గరికపాటిని పిలవనేలేదు.. ఎలా వస్తారు?
ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించని ప్రపంచ తెలుగు మహాసభలకు తాను కూడా వెళ్లనని మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి ఘాటుగా స్పందించారు. ‘అసలు గరికపాటి నరసింహారావును మేము పిలవలేదు. ఆయన్ని ఆహ్వానిస్తూ పంపిన ఆహ్వానపత్రికను చూపించమనండి! మేము ఆహ్వానించింది మాడుగుల నాగఫణి శర్మను..' అని సిధారెడ్డి స్పష్టం చేశారు. ఈ మహాసభల్లో దాదాపు ఎనభై మంది వరకు దళిత కవులు, ఎనభై నుంచి వంద మంది వరకు బీసీ కులాలకు చెందిన కవులు పాల్గొన్నారన్నారు.
ఎన్టీఆర్ ప్రస్తావనే రాలేదంటే ఏం చెబుతాం...
ప్రపంచ తెలుగు మహాసభల్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనే రాలేదేమని అడిగిన ప్రశ్నకు సిధారెడ్డి సమాధానమిచ్చారు. ‘నందమూరి తారకరామారావు రచయిత కాదు, పైగా ఆయన సినీనటుడు, మాజీ ముఖ్యమంత్రి. తెలుగు మహాసభలు భాషకు, సాహిత్యానికి సంబంధించినవి. మరి, ఆయన్ని (ఎన్టీఆర్) గుర్తుచేసుకోలేదంటే దానికి ఏం సమాధానం చెబుతాం? అదే, ఇవి రాజకీయ సభలు అయి ఉంటే, ఎన్టీఆర్ ని తప్పకుండా గుర్తుచేసుకునేవాళ్లం. అసలు గతంలో జరిగిన తెలుగు మహాసభలకు, ఈ మహాసభలకు పొంతన లేదు. అందుకే ఇక్కడ ఎన్టీఆర్, ఏఎన్నార్ ప్రస్తావనే రాలేదు. ఇవి సినిమా వాళ్ల సభలు కాదు..' అని ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.