ఆపద మొక్కులు: అసెంబ్లీ వేదికపై ఒకలా.. బయట మరోలా.. కొలువులపై సీఎం కేసీఆర్
ఉద్యోగ నియామకాలపై విపక్షాలు ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం చేస్తున్న ఆందోళన, తెస్తున్న ఒత్తిడి సీఎం కేసీఆర్ అసహనానికి కారణమవుతున్నది.
హైదరాబాద్: ఒకసారి లక్షా ఏడు వేల ఉద్యోగాలు కల్పిస్తాం.. మరోసారి ప్రజలందరికీ ప్రభుత్వోద్యోగాలివ్వలేం.. కాదు కాదు లక్షా 12 వేల మందికి ఉద్యోగాలిస్తాం.. ఒక వెయ్యి మందికి ఎక్కువగానే ఇస్తాం.. యువతను ఆదుకుంటాం. ప్రపంచం అబ్బుర పడేలా తెలంగాణను తీర్చిదిద్దుతాం... ఇవి తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు.
చట్టసభ అయిన అసెంబ్లీ వేదికగా ఒక రకమైన వాదన వినిపిస్తే.. మీడియా ముందు.. బహిరంగ సభల్లో మరొక విధంగా ప్రతిస్పందించడం సీఎం కేసీఆర్కు ఆనవాయితీగా మారింది. పరిస్థితులను అవసరాలను బట్టి కూడా ఆయన ప్రతిస్పందిస్తున్నారని.. మాటల గారడి చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

తెర వెనుక సర్కార్ విధానం మరోలా..
న్యాయస్థానం ముందు ఒక ప్రకటన చేసి.. తెర వెనుక మరొక విధాన నిర్ణయం అమలు చేయడం తెలంగాణ ప్రభుత్వానికి సంప్రదాయంగా మారింది. గతేడాది ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ హైదరాబాద్ నగరంలో సభ నిర్వహణకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ఎం కోదండరాం అనుమతి కోరితే అందుకు హైదరాబాద్ నగర పోలీసులు నిరాకరించారు. దీనిపై హైకోర్టుకు వెళితే నక్సలైట్లు వచ్చే అవకాశం ఉన్నదని, భాగ్య నగరంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తకూడదని బూచీ చూపి.. ఉప్పల్ చౌరస్తా పరిధిలో సభ నిర్వహించుకోవచ్చునని దాటవేత వ్యూహం అనుసరించింది. తాజాగా ‘కొలువుల కొట్లాట' పేరిట బహిరంగ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోదండరాం చేసిన అభ్యర్థనను నగర పోలీసు విబాగం మరోసారి తిరస్కరించింది. అంత వరకు బాగానే ఉన్నది. కానీ హైకోర్టులో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన వాదనే వింతగా ఉన్నది.

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనేని హైకోర్టుకు పోలీసులు
జిల్లాల్లో జేఏసీ నేతలు అరెస్ట్ అయ్యారని, హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వడం లేదనే సరికొత్త వాదన పోలీసులు వినిపించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు వివిధ రంగాల, వర్గాల ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు సభల నిర్వహణ సంప్రదాయంగా వస్తున్నది. కానీ తెలంగాణ ప్రభుత్వానికి, ప్రత్యేకించి సీఎం కేసీఆర్కు.. అలా ప్రజలు తమ సమస్యల స్వరం వినిపించడం ఇష్టం లేనట్లు కనిపిస్తున్నది.

కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. కార్యకర్తల ముందస్తు కస్టడీ
అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కాంగ్రెస్ పార్టీ ‘చలో అసెంబ్లీ'కి పిలుపునిస్తే జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులను ముందస్తు అరెస్ట్లు, సీనియర్ నేతలను హౌస్ అరెస్టులు చేయించిన ఘనత ప్రభుత్వానిది. నిరసన తెలుపడం ప్రజలకు రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. కానీ ప్రజాస్వామ్యయుతమైన ఆందోళన, రాజ్యాంగ బద్ధంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆయా హక్కులను హరించి వేస్తున్నదన్న విమర్శలున్నాయి. ఇది వేరే సంగతనుకోండి. ‘కొలువుల కొట్లాట' సభకు అనుమతి నిరాకరణపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్.. 1.12 లక్షల ఉద్యోగాలిస్తామని ప్రకటించారు. అవసరమైతే మరో వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే ఇస్తామని సెలవిచ్చారు.

ఏడాదిన్నరలో లక్ష ఉద్యోగాలెలా ఇస్తరన్నదీ సందేహమే
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకానికి సుమారు పదివేల మంది శిక్షణ పొందడం మినహా అధికారం చేపట్టిన మూడున్నరేళ్లలో జరిగిన నియామకాలు పదివేల లోపే.. మరో ఆరు నెలలు గడిస్తే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంటుంది. ఆఫ్కోర్స్. 2019 మార్చి వరకూ నియామక ప్రక్రియ చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియ అంటేనే సుదీర్ఘ కాలంగా జరిగే ప్రక్రియ. అటువంటప్పుడు మిగతా లక్ష ఉద్యోగాలు ఏడాదిన్నరలో ఎలా పూర్తిచేస్తారో సీఎం కేసీఆర్ చెప్పలేదు. కేవలం భర్తీ చేస్తామన్న ప్రకటన తప్ప.. వాటి నియామకానికి ఒక టైంటేబుల్ కూడా నిర్ణయించలేదన్నది నిష్ఠూర సత్యం. మన సమాజంలో ఒక నానుడి ఉంది. 'చెప్పేవాడు చేయడు.. చేసేవాడు చెప్పడని'.. తెలంగాణ సీఎం కేసీఆర్ పనితీరు కూడా అలాగే కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ సమయంలో ఇలా సీఎం కేసీఆర్
గత వారం కూడా అందరికీ ప్రభుత్వోద్యోగాలు కల్పించలేమని సీఎం కేసీఆర్ సెలవిచ్చారు. అంతకుముందు గతేడాది బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉద్యోగ నియామకాలపై జరిగిన చర్చలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం త్రికరణ శుద్ధితో పని చేస్తుందని ప్రకటించారు. మూడు నెలల క్రితం విద్యుత్ శాఖ పరిధిలోని సంస్థల్లో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసినప్పుడూ.. తర్వాత కూడా ఒకటి, రెండు సందర్భాల్లో అందరికీ ఉద్యోగాలివ్వలేమని సెలవిచ్చారు. విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కన్సాలిడేటెడ్ వేతనం చెల్లించాలని, మధ్యవర్తులు అవసరం లేదని హైకోర్టు చురకలంటించడం ప్రభుత్వాధినేతకు కష్టంగా మారింది. వారికి ఒక రూ.1000 అదనంగానే వేతనం ఇస్తామన్నారు. క్రమబద్ధీకరణకు వీలు లేకపోవడంతో ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలనే సర్దుబాటు చేయడంతో వాస్తవంగా వేతనాల పెరుగుదల రూ.300 నుంచి రూ.1000 లోపేనని వార్తలొచ్చాయి.

గోల్కొండ సాక్షిగా ఉద్యోగ నియామకాలపై ఇలా సీఎం కేసీఆర్
తాజాగా ప్రభుత్వోద్యోగాల నియామకాలపై కాంగ్రెస్ సభ్యుడు సంపత్ కుమార్ అడిగిన ప్రశ్నకు సీఎం కేసీఆర్ ప్రతి స్పందిస్తూ ఒక వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే ఇస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు 2014 ఆగస్టు 15వ తేదీన చారిత్రక గోల్కొండ కోట సాక్షిగా అర్హులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని తొలిసారి హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.. ముందు అవసరాలు, నిబంధనల మేరకు ఉద్యోగాలు భర్తీ చేస్తే.. తర్వాత ఒక వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలన్నా.. రూ.1000 ఎక్కువ వేతనం ఇవ్వాలన్నా.. ఇదేమీ కుటుంబ వ్యవహారం కాదు.. సొంత సంస్థానం అంతకన్నా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజానురంజకంగా పాలన సాగించాల్సిన అవసరం ఉన్నదే కానీ.. వాగాడంబరంతో.. అందరి కళ్లు కట్టేందుకు ప్రయత్నిస్తే వికటిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

యూపీఎస్సీ ప్రశంసకు.. టీఎస్పీఎస్సీ నియామక ప్రక్రియకు సారూప్యం ఏది?
గ్రూప్ 1 పరీక్షా ఫలితాల్లో మెరిట్ లిస్టు ప్రకటనలో తేడాలను ప్రశ్నించడం కూడా సీఎం కేసీఆర్కు ఇబ్బందికరంగా ఉన్నట్లు ఉన్నది. ఒక దళితుడిగా టీఎస్ పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి అద్భుతంగా పని చేస్తున్నారని సీఎం కేసీఆర్ కితాబునిచ్చారు. కానీ గత మూడున్నరేళ్లలో సుమారు 10 నుంచి 15 వేల ఉద్యోగాల నియామకాలకు టీఎస్ పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించినా.. ఆయా పరీక్షల ఫలితాలు.. వాటి ఆధారంగా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో నిర్దిష్టమైన సంఖ్య అందుబాటులో లేదు. సీఎం కేసీఆర్ కితాబు అందుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాటల్లోనే ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఐదు వేల లోపేనని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ప్రభుత్వోద్యోగాల నియామక ప్రక్రియలో టీఎస్పీఎస్సీ పనితీరెలా ఉన్నదో అవగతమవుతూనే ఉన్నదని చెప్తున్నారు. టీఎస్ పీఎస్సీని వివిధ కారణాల రీత్యా యూపీఎస్సీ అభినందించి ఉండవచ్చు గానీ.. ఉద్యోగార్థులకు ప్రభుత్వ కొలువుల నియామకమే ప్రధానమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications