అధికారంలోకి వస్తే రిజర్వేషన్లో 50 శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
అలంపూర్: కేంద్రంలోని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం అలంపూర్లో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొని ప్రసంగించారు రాహుల్. ఈ ఎన్నికలు ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నాయన్నారు.
ప్రజాస్వామ్య రక్షణ కోసం ఇండియా కూటమి పోరాటం చేస్తోందని రాహుల్ అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలో 50 శాతం మంది ఆదివాసీలు, దళితులు, వెనుకబడిన తరగతులవారే ఉన్నారని చెప్పారు. అంబేద్కర్, నెహ్రూ, గాంధీల కృషితో రూపొందించిన రాజ్యాంగం వల్లనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట కులగణణ చేస్తామన్నారు రాహుల్. బహుజనులకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ బీజేపీ తీసేయాలని కుట్ర చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మోడీ.. అదానీ, అంబానీ లాంటి వ్యాపారస్తులకు లక్షల కోట్ల రుణమాఫీ చేస్తున్నారన్న రాహుల్.. రైతులకు మాత్రం రుణమాఫీ చేయడం లేదని ఆరోపించారు.
స్త్రీలు ఇంటి పనితోపాటు బయట పని చేయడానికి కూడా వెళ్తున్నారన్న రాహుల్.. మొత్తం 18 గంటల పని చేస్తున్నారనీ.. కానీ, స్త్రీలు ఇంట్లో పని చేసినందుకు ఎలాంటి జీతం రాబట్లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు ఏడాదికి రూ. లక్ష అందిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. గ్రాడ్యూయేట్ పూర్తయిన విద్యార్థులందరికీ ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications