ఓరుగల్లు ముగ్గురు సీఎంలను ఉరికించింది, కెసిఆర్ బాధ: కెటిఆర్, టిఆర్ఎస్లోకి బిజెపి నేత
హైదరాబాద్: ముగ్గురు ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర వరంగల్ జిల్లాది అని, తెలంగాణ వస్తే ఇక్కడ చీకట్లో ఉండిపోవాల్సి వస్తుందని ఏపీ ఆఖరి కిరణం (మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి) భయపెట్టారని, కానీ ఇప్పుడు తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతోందని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు.
తెలంగాణ ఉద్యమం పార్టీలను నమ్ముకోలేదని, తెలంగాణ ప్రజల్నే నమ్ముకుందన్నారు. తద్వారానే సీఎం కేసీఆర్ స్వరాష్ట్రం సాధించారన్నారు. ఏ రాజకీయ పార్టీని నమ్ముకోకుండా భుజం భుజం కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించామో, అలాగే బంగారు తెలంగాణను సాధించుకుందామన్నారు.
ఈ ప్రయాణంలో సమయం కావాలన్నారు. అరవై ఏళ్ల దరిద్రం 15 నెలల్లోనే పోదన్నారు. కొత్త సంసారం.. కొంత సమయం ఇవ్వాలన్నారు. ఐదేళ్లలో మా పాలన బాగా లేకుంటే బండకేసి కొట్టే అధికారం ప్రజలకు ఉందన్నారు. వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అభ్యర్థులే దొరకరన్నారు.

2014 ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పరమేశ్వర్తోపాటు విద్యావేత్త పరంజ్యోతి తదితరులు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో ఆదివారం మధ్యాహ్నం మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసుకోవాలన్నారు. ఉద్యమంలో పని చేసిన ఎవరినీ మరచిపోబోమన్నారు. గతంలో పని చేసిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వరంగల్ జిల్లా ప్రజలు చెప్పులు చూపించారని, ఇంకో ఆయనకు చుక్కలు చూపించారన్నారు.
చంద్రబాబు రైతులను పరామర్శించేందుకు వచ్చినపుడు తెలంగాణ వస్తే మా సమస్యలు పోతయని రైతు పణికెర మల్లయ్య దిమ్మతిరిగే సమాధానం చెప్పిన విషయం గుర్తు చేశారు. ఇంకో ఆయన బచావో అంటూ తిరుగుతున్నారని, నిన్న వరంగల్ పత్తి రైతు దగ్గరికి పోయి.. ప్రభుత్వం ఏం చేయడం లేదని చెప్పబోతే రైతులు దీటుగా సమాధానం చెప్పారన్నారు.
తెలంగాణ ఉద్యమం అయిపోయింది కదా.. వరంగల్ సప్పబడిందని అనుకున్నానని, కానీ నిన్న రైతుల మాటలు, ఇప్పుడు ఈ వేదిక చూసిన తర్వాత ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టమైందన్నారు. వరంగల్కు ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమైతదని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం చిమ్మ చీకట్లకు పోయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ఆఖరి కిరణం కిరణ్ అసెంబ్లీలో ఓ కట్టె పట్టుకొని.. కరెంటు ఉత్పత్తి కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉన్నాయని, కరెంటు వాడకం ఎక్కువగా తెలంగాణలో ఉన్నందున రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణ అంధకారమైతుందన్నారని కానీ ఇప్పుడేమైంది? ఆయన రాజకీయ జీవితం చిమ్మచీకటి అయిందేగానీ తెలంగాణ దేదీప్యమానంగా వెలుగుతోందన్నారు.
ఇప్పటికీ రాత్రిపూటనే రైతులకు కరెంటు ఇస్తున్నప్పటికీ, పగటి పూట ఇచ్చేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. రాత్రిపూట కరెంట్ ఇస్తున్నందుకు కెసిఆర్ బాధపడుతున్నారన్నారు. రాబోయే ఏడాది మార్చి తర్వాత పట్టపగలు 9 గంటల నాణ్యమైన కరెంటును ఇస్తామన్నారు.
వాటర్ గ్రిడ్పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధార, అడ్డగోలు ఆరోపణలని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశంలోని 29 రాష్ర్టాల్లో పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వాటర్గ్రిడ్ పథకంపై ప్రశంసలు కురిపించారని, ఇక్కడ ఉన్న జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ విషయం అర్థం కావట్లేదన్నారు.












Click it and Unblock the Notifications