అన్నదాతను ఆగం చేస్తున్న అకాల వర్షాలు: తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు, ఈరోజు కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు మండిపోతుండగా.. సాయంత్రం నుంచి ఉరుములుమెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా ఇదే పరిస్థి కొనసాగింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
ఆదివారం రాత్రి భారీ వర్షాలు, ఈదురుగాలు బీభత్సం
ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మెదక్, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ జిల్లాల్లో చేతికొచ్చిన ధాన్యం నీటి మునిగింది. పలుచోట్ల వరదనీటిలో కొట్టుకుపోయింది. దీంతో అన్నదాతలు కన్నీటిపర్యంతమవుతున్నారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది.
వరితోపాటు మొక్కజొన్న, సజ్జ, నువ్వు, మామిడి పంటలు నేలవాలాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండడంతో ధాన్యం కుప్పలు వరదనీటిలో మునిగిపోయాయి. మరోవైపు పంట పొలాలలో వేసిన నువ్వులు, మొక్కజొన్న పంటలు నెలకొరిగాయి. దీంతో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షాలు నమోదు
కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని 16 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందని టీఎస్డీపీఎస్ తెలిపింది. సిద్దిపేట జిల్లా రాంపూర్లో అత్యధికంగా 5.6 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా పొద్దటూర్లో 5.45, రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగారంలో 4.40, సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో 3.93, రుద్రారంలో 3.80 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వెల్లడించింది. కొన్ని చోట్ల పట్టణాల్లో భారీ చెట్లు విరిగి రోడ్లపై, విద్యుత్ తీగలపై పడటంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది.
సోమవారం కూడా తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు
సోమవారం సిద్దిపేట, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రంగారెడ్డి, నాగర్కర్నూల్, ములుగు, నారాయణపేట, వికారాబాద్ జిల్లాల్లో పలుచోట్ల గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో సాయంత్రం వరకు మండిపోతున్న ఎండలు
మరోవైపు ఆదివారం తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోయాయి. హైదరాబాద్ తప్ప దాదాన అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.2 డిగ్రీలు, చప్రాలలో 44.9, నిర్మల్ జిల్లా తానూరులో 44.8, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్లో 45 డిగ్రీలపైన, నిర్మల్, కుమ్రంభీం, పెద్దపల్లి జిల్లాల్లో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం అదనంగా 1 నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.