తెలంగాణలో రానున్న మూడురోజులపాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మార్చి మొదటి వారం నుంచే ఎండలు మండిపోతున్నాయి. రెండ్రోజులుగా వడగాలులు కూడా వీస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉండనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గురువారం నల్గొండ జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యిందని ఐఎండీ అధికారులు వెల్లడించారు.

ఆదిలాబాద్, కుమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టానికి సుమారు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ద్రోణి శుక్రవారం బలహీనపడినట్లు తెలిపింది. శుక్రవారం తూర్పు విదర్భా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను ముంచుకొస్తుందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో కేంద్ర విపత్తు నిర్వహణశాఖ అప్రమత్తమైంది. శ్రీలంక నుంచి అండమాన్ నికోబర్ దీవుల వైపు తుఫాను దూసుకొస్తున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది.
2022లో మొదటి తుఫానుగా చెప్పబడుతున్న ఈ తుఫానుకు "సైక్లోన్ అసని"గా నామకరణం చేశారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరప్రాంతంలో విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమయ్యాయి. తుఫాను దృష్ట్యా అండమాన్ - నికోబార్ కేంద్ర పాలిత ప్రాంతంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై విపత్తు నిర్వహణ, కేంద్ర బలగాలు, అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సమీక్షలు నిర్వహించారు.
తుఫాను కదలికలపై పూర్తి అప్రమత్తంగా ఉంటూ క్రమం తప్పకుండా సూచనలు చేయాలని అజయ్ భల్లా ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిపై అండమాన్ - నికోబార్ అడ్మినిస్ట్రేషన్ తో సంప్రదింపులు జరపాలని ఆయాశాఖల అధికారులకు సూచించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తూర్పు తీరంలో చేపలు పట్టడం, పర్యాటకం, షిప్పింగ్ కార్యకలాపాలు ప్రస్తుతం నిలిపివేశారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తిరిగి రావాలని అధికారులు ఆదేశించారు. అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ), ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ లు స్టాండ్ బైలో ఉండాలని కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.












Click it and Unblock the Notifications