weather: తెలంగాణలో మరో మూడ్రోజులపాటు ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మరికొద్ది రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్-మయన్మార్ తీరంలో ఇది ఏర్పడిందని పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపింది.
ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదిలి రాగల 6 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయం మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.

దీని ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు బయటికి వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
కాగా, గత రెండు మూడు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి ప్రవాహం నెమ్మదించింది. భద్రాచలం వద్ద నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 53.3 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు వెల్లడించారు. అయితే, భద్రాచలం చుట్టుపక్కల గ్రామాల ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications