తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు: ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల తిరోగమనం మొదలవుతుందని పేర్కొంది.
ఈ నేపథ్యంలో రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో వైపు, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని పేర్కొంది. బుధవారం వరకు ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు మహబూబాబాద్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. మరో వైపు, సోమవారం ఆదిలాబాద్, సంగారెడ్డి, ములుగు, కరీంనగర్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

హైదరాబాద్లో కుండపోత వర్షం:హైదరాబాద్ నగర వ్యాప్తంగా సోమవారం మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.
హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మెహదీపట్నం, కోఠి, దిల్సుఖ్నగర్, బేగంబజార్, చార్మినార్, రాణిగంజ్, ప్యాట్నీ, ప్యారడైజ్, సుచిత్ర, జీడిమెట్ల, చింతల్, బాల్ నగర్, కూకట్పల్లి, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది.
కాగా, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు తదితర హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. భారత వాతావరణ శాఖ ప్రకారం.. హైదరాబాద్లోని మొత్తం ఆరు జోన్లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బి నగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి - సెప్టెంబర్ 28 వరకు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications