తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు, ఈదురుగాలులు, వడగండ్ల వానలు కూడా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తాయని పేర్కొంది.
మూడ్రోజులపాటు తెలంగాణలో వర్షాలు.. ఈదురుగాలులు
ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికితోడు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఉపరితల ద్రోణి కూడా కొనసాగుతోంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అక్కడడక్క వడగండ్ల వర్షాలు కూడా కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు ప్రదేశాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, గురువారం ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల్లో మోస్తారు వర్షం పడింది. రాష్ట్రంలో అత్యధికంగా వికారాబాద్ జిల్లా మొయిన్పేటలో 31.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ అకాల వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.
పంటలు దెబ్బతిని రైతుల ఆందోళన
కరీంనగర్ జిల్లాలో కూడా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నిల్వలను కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. చేతికి వచ్చిన పంటతోపాటు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం వర్షాల కారణంగా దెబ్బతిందని రైతులు భోరున విలపిస్తున్నారు. మిర్చి పంటలు కూడా దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు
ఇది ఇలావుంటే, జూన్ 1న కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు జూన్ 9వ తారీఖు నాటికి తెలంగాణలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సీజన్లో దేశ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదవుతుందని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అంతకుమించి వర్షాలు నమోదవుతాయని పేర్కొంది.