తెలంగాణలో మరో మూడురోజులపాటు వర్షాలు: చల్లని ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. దీంతో వాతావరణం చల్లగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పడమటి గాలులు వీస్తున్నాయని, వాటి ఫలితంగానే రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
సోమ, మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. పశ్చిమదిశ నుంచి కిందిస్థాయిలో గాలులు వీస్తున్నాయని, ఫలితంగా రాష్ట్రంలో వాతావరణం చల్లగా ఉంటుందన్నారు. రానున్న మూడు రోజులపాటు ఉదయం సమయంలో వాతావరణం ఇలాగే ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం వరకు వాతావరణ పరిస్థితులు మారతాయన్నారు.
ఆదివారం హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు(29.9, 29.8 డిగ్రీలు) నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ, భద్రాచలంలో 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగితా జిల్లాల్లో 30 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
Recommended Video
ఇది ఇలావుండగా, జులైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జులై మొదటివారంలోనే రుతుపవనాలు ఊపందుకున్నాయని, అయితే, నెల చివరికి 7 శాతం లోటుతో ముగిసిందని తెలిపింది. కాగా, మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో చెరువులు, డ్యాంలు నిండుకుండలను తలపిస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి.